ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాశీబుగ్గ తొక్కిసలాట ఘటన.. బాధితులకు పరిహారం ప్రకటించిన ప్రభుత్వం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 01, 2025, 10:29 PM

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో శనివారం పెను విషాదం చోటుచేసుకుంది. వెంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 9 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. 16 మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో బాధితుల కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. మంత్రి నారా లోకేష్ కాశీబుగ్గ ఆలయాన్ని సందర్శించారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. గాయపడి పలాస ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి నారా లోకేష్.. కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తరుఫున పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.15 లక్షలు, గాయపడిన వారికి రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు.


మరోవైపు 94 ఏళ్ల వృద్ధుడు తన సొంత ఖర్చుతో ఈ ఆలయం నిర్మించారని మంత్రి నారా లోకేష్ తెలిపారు. అయితే భక్తులు ఇంత పెద్ద సంఖ్యలో వస్తారని ఊహించలేకపోయారని తెలిపారు. భక్తుల కోసం బారీకేడ్లు ఏర్పాటు చేసినప్పటికీ.. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో అవి సరిపోలేదన్నారు. తొక్కిసలాట సమాచారం తెలిసిన వెంటనే అధికారులను, ఎమ్మెల్యేను అప్రమత్తం చేశామని నారా లోకేష్ వివరించారు. గాయపడినవారిని వెంటనే ఆస్పత్రులకు తరలించామన్నారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని వివరించారు. మరోవైపు తొక్కిసలాట ఘటనలో గాయపడి పలాస ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 16 మందికి ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పినట్లు నారా లోకేష్ వెల్లడించారు. తీవ్రంగా గాయపడినవారికి మెరుగైన చికిత్స అందిస్తామని నారా లోకేష్ వెల్లడించారు.


మరోవైపు కార్తీక ఏకాదశి పర్వదినం రోజు కావటంతో శనివారం రోజున వెంకటేశ్వరస్వామి ఆలయానికి భారీగా భక్తులు వచ్చారు. కాశీబుగ్గతో పాటుగా పలాస, మందస, వజ్రపుకొత్తూరు వంటి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా భక్తులు భారీగా వచ్చారు. అయితే అంచనా వేసిన దానికంటే అధికసంఖ్యలో భక్తులు రావటంతో నిర్వహణ కష్టమైపోయింది. శనివారం ఉదయం 11 గంటల 45 నిమిషాల సమయంలో ప్రవేశ మార్గం వద్ద తొక్కిసలాట జరిగింది. దీంతో రెయిలింగ్ విరిగిపడటంతో ఆలయానికి వచ్చిన భక్తులు ఒకరిపై ఒకరు పడిపోయారు.ఈ ప్రమాదంలో 9 మంది భక్తులు చనిపోయారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa