జగన్ మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. నవంబర్ 4వ తేదీ మంగళవారం ఆయన కృష్ణా జిల్లాలో పర్యటించి, పంటలు నష్టపోయిన రైతులను పరామర్శించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పెనమలూరు, పామర్రు, పెడన, మచిలీపట్నం నియోజకవర్గాల్లోని గ్రామాలను సందర్శిస్తారు. తుపాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన అన్నదాతలకు సంఘీభావం తెలిపేందుకు ఈ పర్యటన చేపట్టినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా పెడన మచిలీపట్నంలో క్షేత్రస్థాయిలో దెబ్బతిన్న పంటలను స్వయంగా పరిశీలించి, రైతులతో ముఖాముఖి మాట్లాడనున్నారు.జగన్ పర్యటన వివరాలను మాజీ మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్సీ తలశిల రఘురాం శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల సంభవించిన మొంథా తుపాను కారణంగా రాష్ట్రంలో భారీ వర్షాలు, బలమైన గాలులకు పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని, రైతులు కుదేలయ్యారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని వారు విమర్శించారు. గత వైసీపీ ప్రభుత్వంలో రైతులకు అండగా నిలిచిన ఉచిత పంటల బీమా వంటి కీలక పథకాలను రద్దు చేయడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆరోపించారు.ఏ సీజన్లో నష్టం జరిగితే అదే సీజన్లో పరిహారం అందించే విధానానికి ప్రస్తుత ప్రభుత్వం స్వస్తి పలికిందని వారు దుయ్యబట్టారు. గత 18 నెలల్లో రాష్ట్రంలో 16 సార్లు అల్పపీడనాలు తుపానులు సంభవించినా రైతులకు సరైన సహాయం అందలేదని పేర్కొన్నారు. సుమారు రూ.600 కోట్ల మేర ఇన్పుట్ సబ్సిడీని ప్రభుత్వం పెండింగ్లో పెట్టిందని, రైతు భరోసా కేంద్రాలు ఈ-క్రాప్ విధానాన్ని నిర్వీర్యం చేసిందని వారు ఆరోపించారు. రైతుల సంక్షేమాన్ని ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని విమర్శలు గుప్పించారు.ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మొంథా తుపాను రైతుల నడ్డి విరిచిందని, ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ గానీ, కార్యాచరణ గానీ లేకపోవడంతో రైతులకు భరోసా కల్పించేందుకే జగన్ ఈ పర్యటన చేపడుతున్నారని పేర్ని నాని, తలశిల రఘురాం వివరించారు. రైతుల పక్షాన నిలబడి, వారి గళాన్ని బలంగా వినిపించి, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం ద్వారా వారికి న్యాయం జరిగేలా చూడటమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని వారు స్పష్టం చేశారు. రైతుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, వారికి తక్షణ సాయం అందేలా కృషి చేస్తామని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa