ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ.9,910 కోట్లతో....ఏపీకి మరో భారీ ప్రాజెక్టు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 03, 2025, 07:04 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి రానుంది. క్లీన్ ఎనర్జీ (శుద్ధ ఇంధనం) రంగంలో భారీగా పెట్టుబడులు ఆకర్షించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ రంగంలో ఏపీని హబ్‌గా మార్చాలని ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలోనే కీలక అడుగు పడింది. కర్నూలు జిల్లాలో బ్రూక్ ఫీల్డ్ చేపట్టనున్న రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టు కోసం రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రూ.7,500 కోట్ల నిధులను మంజూరు చేసింది. రూ.9,9010 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టు చేపట్టనున్నారు. 640 మెగావాట్ల పవన విద్యుత్, 400 మెగావాట్ల సౌర శక్తి.. మొత్తంగా 1040 మెగావాట్ల హైబ్రిడ్ రెన్యువబుల్ ఎనర్జీ ఉత్పత్తే లక్ష్యంగా ఈ ప్రాజెక్టు చేపడుతున్నారు. ఈ ప్రాజెక్టు కోసం ఆర్ఈసీ 7500 కోట్లు నిధులు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ఒక ప్రైవేట్ రంగ ప్రాజెక్టుకు ఆర్ఈసీ ఈ స్థాయిలో నిధులు ఇవ్వడం ఇదే తొలిసారని అధికార వర్గాలు వెల్లడించాయి.


ఈ ప్రాజెక్టును బ్రూక్‌ఫీల్డ్, యాక్సిస్ ఎనర్జీ సంయుక్తంగా ప్రారంభించిన ఎవ్రెన్ సంస్థ చేపట్టనుంది. మరోవైపు ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఇటీవల లండన్‌లో పర్యటించారు. ఆగస్టు నెలలో లండన్‌లో బ్రూక్‌ఫీల్డ్ గ్లోబల్ ప్రెసిడెంట్ కానర్ టెస్కీతోనారా లోకేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో క్లీన్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు. మరోవైపు బ్రూక్‌ఫీల్డ్ సంస్థ ప్రపంచంలోని అతిపెద్ద ఆల్టర్నేటివ్ ఇన్‌వెస్ట్‌మెంట్ మేనేజర్లలో ఒకటి. బ్రూక్ ఫీల్డ్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 46 GW ఇన్‌స్టాల్డ్ కెపాసిటీ, 200 GW పైప్‌లైన్‌ సామర్థ్యం కలిగి ఉంది.


 మరోవైపు కర్నూలు జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. ముఖ్యంగా ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్‌కు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయి. ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్‌లో రిలయన్స్ వంటి సంస్థలు కూడా పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓర్వకల్లు స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీగా అభివృద్ధి చెందుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అనేక ప్రాజెక్టులను ప్రతిపాదిస్తోంది. అలాగే కేంద్రం నుంచి కూడా సహకారం అందుతోంది.


మరోవైపు క్లీన్ ఎనర్జీ రంగంలో వచ్చే ఐదేళ్లలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ పెట్టుబడుల ద్వారా సుమారుగా 7.5 లక్షల మందికి ఉపాధి కల్పించాలని భావిస్తోంది. అందులో భాగంగానే ఇంటిగ్రేటెడ్‌ క్లీన్‌ ఇంధన పాలసీని ఏపీ ప్రభుత్వం ఖరారు చేసింది. 2025-2030 సంవత్సరాల మధ్య ఏర్పాటు చేసే ప్రాజెక్టులకు ఈ పాలసీ వర్తించనుంది .






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa