ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పులికాట్ సరస్సుకు మహర్దశ.. ఫ్లెమింగో పక్షుల కోసం శాశ్వత నివాసం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 03, 2025, 07:08 PM

తిరుపతి జిల్లాలోని పులికాట్ సరస్సు దశ మారనుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని ఎకో టూరిజం స్పాట్‌గా అభివృద్ధి చేసేందుకు కసరత్తులు చేస్తోంది. ఈ సరస్సు ఉప్పునీటికే కాకుండా.. వేల కిలో మీటర్ల దూరం ప్రయాణించి వచ్చే సైబీరియన్ పక్షులకు చాలా ఫేమస్. ఏటా శీతకాలంలో పులికాట్ సరస్సుకు విదేశీ అతిథులు ఫ్లెమింగో పక్షులు రాకమొదలైంది. ఈ నేపథ్యంలో ఇక్కడ మూడు రోజుల పాటు ఫ్లెమింగో ఫెస్టివల్ జరగనుంది. మూడు రోజుల పాటు జరగనున్న ఈ ఫెస్టివల్‌కు.. లక్షలాది మంది పక్షి ప్రేమికులు హాజరుకానున్నారు. అయితే ఈ ఫ్లెమింగో పక్షులు కేవలం శీతకాలంలోనే కాదు.. ఇకపై ఏడాదంతా పక్షి ప్రేమికులకు కనువిందు చేయనున్నాయి. ఈ మేరకు పులికాట్ సరస్సును వాటికి శాశ్వత నివాసంగా మల్చడానికి అనుకూలమైన పరిస్థితులు కల్పిస్తామన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ ప్రాంతాన్ని ఎకో టూరిజం హబ్‌గా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.


ఫ్లెమింగోలతో అనుబంధానికి నిదర్శనం..


పులికాట్ సరస్సుకు శీతకాలం అతిథుల రాక మొదలైందని.. వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి వస్తున్న ఫ్లెమింగోలు మనందరికీ కనువిందు చేయడానికి సిద్ధమయ్యాయని పవన్ కళ్యాణ్ అన్నారు. ఆహారం, విశ్రాంతి నిమిత్తం ఆరు నెలలపాటు పులికాట్ పరిసరాల్లో ఈ ఫ్లెమింగో పక్షులు ఉంటాయని.. అందుకే ఏటా ఈ నీటి పక్షుల రాకను ‘ఫ్లెమింగో ఫెస్టివల్’ పేరిట వేడుక చేసుకుంటామన్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకకు రాష్ట్రం నలుమూలల నుంచి 7-8 లక్షల మంది పక్షి ప్రేమికులు రానున్నట్లు తెలిపారు. ఇది ఫ్లెమింగోలతో ప్రజలకు ఉన్న అనుబంధానికి నిదర్శనమని పవన్ పేర్కొన్నారు.


 "అందరూ ముద్దుగా రాజహంస అని పిలుచుకునే ఈ ఫ్లెమింగోలు.. జీవ వైవిధ్యానికి ప్రతీకలుగా నిలుస్తాయి. అక్టోబర్ మాసంలో వచ్చి మార్చిలో తిరిగి వెళ్లిపోయే ఈ విదేశీ అతిథులు.. మన ఆతిథ్యం నచ్చిందో ఏమో, ఈ మధ్య ఏడాది పొడుగునా కనువిందు చేస్తున్నాయి. ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమంలో భాగంగా.. ఫ్లెమింగోలు ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా అటవీ శాఖ ఆధ్వర్యంలో అనుకూల పరిస్థితులు కల్పిస్తున్నాం. ఫ్లెమింగోల ఆహారం, విశ్రాంతి, భద్రతకు ఇబ్బందులు కలగకుండా గత కొంత కాలంగా తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. ఈసారి మూడు రోజుల పండుగతో సరిపెట్టకుండా.. ఎకో టూరిజాన్ని విస్తరించే ప్రక్రియలో భాగంగా ఫొటోగ్రఫీ, బర్డ్ సీయింగ్, ఎకో క్లబ్ పేరిట వివిధ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం" అని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.


ఫ్లెమింగోలకు ఇబ్బంది కలగకుండా చర్యలు..


ఇటీవల మొంథా తుఫాన్‌ ఎంత విధ్వంసం సృష్టించిందో తెలిసిందే. అయితే ఈ తుఫాన్‌ ప్రారంభానికి ముందే ఫ్లెమింగోల రాక మొదలయ్యిందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. పెను గాలులు, భారీ వర్షాలకు వాటి స్థావరాలకు ఇబ్బంది కలగకుండా.. అటవీ శాఖ ఆధ్వర్యంలో తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు వెల్లడించారు. రానున్న మూడు నెలలు ఫ్లెమింగోల రక్షణపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలని అటవీ అధికారులకు దిశానిర్దేశం చేసినట్లు చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa