కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత గిరిరాజ్ సింగ్ మరోసారి తన వ్యాఖ్యలతో రాజకీయ దుమారం రేపారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బురఖా ధరించిన ఓటర్లను తనిఖీ చేయాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. దొంగ ఓట్లను అరికట్టేందుకే ఈ చర్యలు అవసరమని ఆయన వాదించారు.బేగూసరాయ్ ఎంపీ అయిన గిరిరాజ్ సింగ్ మాట్లాడుతూ "అనుమానాస్పదంగా కనిపించే బురఖా ధరించిన ఓటర్లను కచ్చితంగా తనిఖీ చేస్తాం. దీని కోసం మా వాళ్లు నిఘా పెడతారు" అని స్పష్టం చేశారు. అంతటితో ఆగకుండా, "ఇది బీహార్.. పాకిస్థాన్ కాదు. ఇక్కడ షరియా చట్టాన్ని అమలు చేయడానికి వీల్లేదు" అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం బీహార్ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.గిరిరాజ్ సింగ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో జరిగిన అనేక ఎన్నికల సమయంలోనూ ఆయన ఇలాంటి మతపరమైన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. ప్రతిసారీ ఆయన వ్యాఖ్యలపై విపక్ష పార్టీల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని ఎన్నికల వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. గతంలో ఆయన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘానికి పలు ఫిర్యాదులు కూడా అందాయి. ప్రస్తుత వ్యాఖ్యలతో మరోసారి రాజకీయ వాతావరణం వేడెక్కింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa