బ్లాంకెట్, బెడ్షీట్ కోసం రైల్వే సిబ్బంది, జవాన్ మధ్య చోటుచేసుకున్న వాగ్వాదం చివరకు ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. కోచ్ అటెండెంట్ దాడిలో సైనికుడు ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటన జమ్మూ గుజరాత్ మధ్య ప్రయాణించే సబర్మతి ఎక్స్ప్రెస్ చోటుచేసుకుంది. తాజాగా, ఈ ఘటనపై జాతీయ మానవహక్కుల కమిషన్ స్పందించింది. కదులుతోన్న రైలులో సైనికుడి హత్యపై నిష్పాక్షిక దర్యాప్తు జరపాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని తేల్చిచెప్పింది. అలాగే, బాధ్యులైన రైల్వే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని, జవాన్ కుటుంబానికి పరిహారం చెల్లించాలని మానవ హక్కుల సంఘం స్పష్టం చేసింది.
రైల్వే వర్గాలు వెల్లడించిన సమాచారం ప్రకారం.. బ్లాంకెట్, బెడ్షీట్ కోసం జవాన్, కోచ్ అటెండెంట్ మధ్య వాగ్వాదం జరిగింది. గుజరాత్లోని సబర్మతికి చెందిన ఆర్మీ జవాన్ జిగార్ చౌధురి పంజాబ్లో విధులు నిర్వర్తిస్తున్నాడు. కొద్దిరోజుల సెలవుల కోసం నవంబరు 2న ఫిరోజ్పూర్ స్టేషన్లో జమ్ముతావి-సబర్మతి ఎక్స్ప్రెస్ రైలు ఎక్కారు. స్లీపర్ కోచ్లో ఉన్న ఆయన.. బీ4 ఏసీ కోచ్ అటెండెంట్ బ్లాంకెట్, బెడ్షీట్ అడిగారు. నిబంధనల ప్రకారం స్లీపర్ కోచ్ ప్రయాణికులకు ఇవ్వడం కుదరదని అతడు చెప్పాడు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. క్రమంగా ఇది భౌతిక దాడికి దారితీసింది. చివరకు సైనికుడ్ని కోచ్ అటెండెంట్ తన వద్ద ఉన్న కత్తితో పొడిచాడు. దీంతో జవాన్ అక్కడికక్కడే మృతిచెందాడు.
రైలు బికనీర్ స్టేషన్కు చెరుకున్న తర్వాత టీటీఈ ఫిర్యాదు ఆధారంగా రైల్వే పోలీసులు హత్య కేసు కింద ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. నిందితుడ్ని జుబైర్ మిమన్గా గుర్తించిన పోలీసులు.. అతడ్ని అరెస్ట్ చేసి, హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు జుబైర్ను కాంట్రాక్టర్ ద్వారా నియమించుకున్నారు. అతడ్ని తప్పించారని, ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
ఈ ఘటనపై సహ్యద్రి రైట్స్ ఫోరమ్ అనే ఓ ఎన్జీఓ చేసిన ఫిర్యాదు ఆధారంగా రైల్వే బోర్డ్ ఛైర్మన్, ఆర్పీఎఫ్ డీజీలకు జాతీయ మానవహక్కుల సంఘం నోటీసులు జారీచేసింది. ఇది తీవ్రమైన మానవహక్కుల ఉల్లంఘనేనని పేర్కొంది. ప్రియాంక్ కనూంగో నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించి, నిందితుడైన కోచ్ అటెండెంట్ నియామక ప్రక్రియ, అర్హతలు, శిక్షణ, పోలీసు వెరిఫికేషన్కు సంబంధించిన అన్ని పత్రాలను సమర్పించాలని రైల్వేను కోరింది. రైల్వే బోర్డు, ఆర్పీఎఫ్ రెండు వారాల్లోగా ఏం చర్యలు తీసుకున్నారో నివేదికను తమకు సమర్పించాలని ఆదేశించింది. ఏది ఏమైనప్పటికీ కుటుంబంతో గడిపేందుకు వస్తూ రైల్లోనే సైనికుడు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాదాకరం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa