జమ్మూకశ్మీర్లోని కుప్వారా జిల్లాలో నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంబడి ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని భారత సైన్యం సమర్థవంతంగా అడ్డుకుంది. ఈ ఆపరేషన్లో ఇద్దరు టెర్రరిస్టులను మట్టుబెట్టినట్లు రక్షణ శాఖ వర్గాలు శనివారం వెల్లడించాయి. కేరన్ సెక్టార్లో ఈ ఘటన చోటుచేసుకుంది.శుక్రవారం రాత్రి కేరన్ సెక్టార్లోని 'పింపుల్' అనే ఫార్వర్డ్ డిఫెండెడ్ లొకేషన్ (ఎఫ్డీఎల్) సమీపంలో 21 గ్రెనేడియర్స్ దళాలు అనుమానాస్పద కదలికలను గుర్తించాయి. వెంటనే అప్రమత్తమైన సైనికులు కాల్పులు ప్రారంభించారు. దీనికి ఉగ్రవాదులు ఎదురుకాల్పులకు దిగడంతో కొద్దిసేపు కాల్పులు జరిగాయి. ఈ ఆపరేషన్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని అధికారులు తెలిపారు. "ఆపరేషన్ పింపుల్" పేరుతో ఈ సైనిక చర్య కొనసాగుతోందని వారు పేర్కొన్నారు.ప్రస్తుతం ఆ ప్రాంతమంతా సైన్యం అధీనంలో ఉంది. మరే ఇతర ఉగ్రవాది అయినా నియంత్రణ రేఖ దాటి లోపలికి ప్రవేశించి ఉండవచ్చనే అనుమానంతో గాలింపు చర్యలు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa