ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కురుబలకు త్వరలోనే ఆధునిక పనిముట్లు.. నారా లోకేష్ ప్రకటన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 08, 2025, 07:19 PM

ఏపీ మంత్రి నారా లోకేష్ కురుబ సామాజికవర్గానికి గుడ్ న్యూస్ వినిపించారు. భక్త కనకదాస జయంతి సందర్భంగా నారా లోకేష్ అనంతపురం జిల్లాలో పర్యటించారు. కల్యాణదుర్గంలో భక్త కనకదాస కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడిన మంత్రి నారా లోకేష్.. భక్త కనకదాస జీవితం అందరికీ ఎంతో స్ఫూర్తిదాయకం అన్నారు. సామాజిక తత్వవేత్తగా, స్వరకర్తగా ఆయన చేసిన సేవలు కొనియాడారు. ఈ సందర్భంగా కురుబ సామాజికవర్గానికి మంత్రి నారా లోకేష్ తీపికబురు వినిపించారు. రాజకీయంగా కురుబ సామాజికవర్గం టీడీపీకి ఎల్లప్పుడూ అండగా నిలబడిందని లోకేష్ అన్నారు. కురుబలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.300 కోట్లు కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు.ఆదరణ 3.0 పథకం కింద కురుబలకు త్వరలోనే పనిముట్లు అందిస్తామని నారా లోకేష్ వెల్లడించారు.


మరోవైపు ఆదరణ పథకం కింద చేతివృత్తుల వారికి ప్రభుత్వం సహాయం అందిస్తోంది. 2017-18 మధ్యకాలంలో ఆదరణ-2 పథకం అప్పటి టీడీపీ ప్రభుత్వం చేతివృత్తుల వారికి పరికరాలు అందించింది. ఇప్పుడు మరోసారి అధికారంలోకి రావడంతో చేతివృత్తుల వారిని ప్రోత్సహించేలా.. వారికి నూతన సాంకేతిక పరికరాలు అందించాలనే ఉద్దేశంతో ఆదరణ 3. 0 పథకం తీసుకువస్తోంది. ఇక ఆదరణ 3.0 పథకం కింద చేతివృత్తుల వారిని ప్రోత్సహించేందుకు వారిని 12 విభాలుగా ప్రభుత్వం విభజించింది. నాయీబ్రాహ్మణ, రజక, పద్మశాలి కులాలవారికి విడివిడిగా పరికరాలు ఇవ్వాలని భావిస్తోంది. మిగిలిన చేతివృత్తుల వారికి ఎంచుకున్న రంగంలో, అలాగే కోరుకున్న పరికరాలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.


మరోవైపు వెనుకబడిన వర్గాలకు ప్రోత్సాహం అందించాలనే ఉద్దేశంతో ఆదరణ-3 పథకం అమలులో ఈసారి కొత్త మార్పులు చేస్తున్నారు. ఆదరణ 2.0 పథకంలో ప్రభుత్వమే కులవృత్తులకు అవసరమైన పరికరాలు ఎంపిక చేసి వారికి పంపిణీ చేసింది. అయితే ఈసారి ఎలాంటి అత్యాధునిక పరికరాలో వారే నిర్ణయించుకునే అవకాశం కల్పించింది, ఈ నిర్ణయం ద్వారా చేతివృత్తుల వారికి ఏది అవసరమో అదే అందించే వీలుంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఆదరణ-3 పథకం అమలు చేయడం కోసం ఏపీ ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్‌లో వేయి కోట్ల రూపాయలు కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద అందించే పరికరాల కోసం లబ్ధిదారులు పది శాతం వాటాను చెల్లిస్తే.. మిగతా 90 శాతాన్ని ప్రభుత్వం రాయితీ ఇవ్వనుంది. మరోవైపు యాదవ, కురబ సామాజిక వర్గాలకు చెందిన వారు ప్రధానంగా మేకలు, గొర్రెల పెంపకంపై ఆధారపడి జీవిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో వారికి ఆదరణ 3.0 పథకం కింద సోలార్ లైట్లు, గుడారాలు, కోత మిషన్లు, పచ్చగడ్డి మిషన్లు అందించాలని కోరుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa