ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రపంచకప్ గెలిచిన బౌలర్ క్రాంతి గౌడ్‌కు అరుదైన గౌరవం

sports |  Suryaa Desk  | Published : Sun, Nov 09, 2025, 08:18 PM

భారత మహిళా క్రికెట్ జట్టు 2025 ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన బౌలర్ క్రాంతి గౌడ్ కుటుంబానికి ఒక తీపి కబురు అందింది. ఆమె తండ్రి మున్నా సింగ్ గౌడ్‌ను తిరిగి పోలీస్ కానిస్టేబుల్‌గా నియమించనున్నట్లు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ప్రకటించారు. భోపాల్‌లో క్రాంతి గౌడ్‌కు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఆయన ఈ హామీ ఇచ్చారు.దాదాపు 13 ఏళ్ల క్రితం, 2012లో ఎన్నికల విధుల్లో జరిగిన ఒక పొరపాటు కారణంగా మున్నా సింగ్ తన ఉద్యోగాన్ని కోల్పోయారు. కూతురి అద్భుత ప్రదర్శన ఇప్పుడు ఆయన కోల్పోయిన గౌరవాన్ని తిరిగి తీసుకురానుంది. ఈ సందర్భంగా క్రాంతి తన కుటుంబం పడిన ఆర్థిక కష్టాలను గుర్తుచేసుకుంది. "ఒక్కోసారి తినడానికి తిండి కూడా ఉండేది కాదు. పక్కింటి వాళ్ల సాయంతోనే ఆకలి తీర్చుకునేవాళ్లం" అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తన తండ్రిని మళ్లీ పోలీస్ యూనిఫాంలో చూసి, గౌరవంగా పదవీ విరమణ చేయాలన్నదే తన కల అని చెప్పింది.ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మాట్లాడుతూ, "క్రాంతి తన ఆటతో దేశం గర్వపడేలా చేసింది. ఆమె తండ్రికి గౌరవం తిరిగి ఇవ్వడం సరైనదే" అని అన్నారు. దీంతో పాటు, క్రాంతి స్వగ్రామమైన ఛతర్‌పూర్‌లో ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఒక స్టేడియం నిర్మిస్తామని కూడా హామీ ఇచ్చారు. ఈ స్టేడియం స్థానిక క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తుందని ఆయన తెలిపారు. రాష్ట్ర క్రీడల మంత్రి విశ్వాస్ సారంగ్, క్రాంతి తల్లిదండ్రులను, కోచ్‌ను సత్కరించారు.నవంబర్ 15న గిరిజన గౌరవ దినోత్సవం సందర్భంగా క్రాంతి విజయాన్ని పురస్కరించుకుని ఒక భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని సీఎం ప్రకటించారు. కాగా, 2025 ప్రపంచకప్ సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాపై గెలుపునకు ఒక చిన్నారి ప్రేరణగా నిలిచిందని క్రాంతి గుర్తుచేసుకుంది. మ్యాచ్‌కు ముందు ఒక ఆలయంలో నాలుగు నెలల చిన్నారితో ఉన్న తల్లిని కలిశామని, తన బిడ్డ క్రికెటర్ కావాలని ఆ తల్లి కోరుకోవడం తమలో స్ఫూర్తి నింపిందని ఆమె వివరించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa