ఆంధ్రప్రదేశ్కు సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది. పోర్టులు, అనుబంధ పరిశ్రమలతో లక్షల మందికి ఉపాధి కల్పించే సామర్థ్యం ఈ తీర ప్రాంతానికి ఉంది. అయితే చాలా ప్రభుత్వాలు తీర ప్రాంత అభివృద్ధిపై సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్లలేకపోయాయి. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం తీర ప్రాంత అభివృద్ధిపై దృష్టి సారించింది. రాష్ట్రాంలోని తీర ప్రాంతంలో పోర్టులు.. వాటికి అనుసంధానంగా పారిశ్రామిక క్లస్టర్లను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సమగ్ర ప్రణాళిక రూపొందించింది. తీర ప్రాంతం వెంట జిల్లాల్లో మారిటైం ప్రాజెక్టులు తెచ్చేలా ప్రణాళికలు రూపొందించింది. అందుకోసం పోర్టు ప్రాక్సిమల్ ఏరియా.. అంటే పోర్టు నుంచి కనీసం రెండు మూడు కి.మీ. పరిధిలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి రూ. రూ.1,220 కోట్లతో ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.
ఓడరేవు సమీపంలో జరిగే కార్యకలాపాలకు అనుగుణంగా.. ఆయా క్లస్టర్లు అభివృద్ధి చేయనున్నారు. దాని కోసం పోర్టుకు సమీపంలో ఉన్న ఉప్పు భూములను వినియోగించుకోవాలని భావిస్తున్న ప్రభుత్వం.. ఆ భూములను రాష్ట్రానికి కేటాయించేలా కేంద్రాన్ని కోరాలని ప్రయత్నాలు చేస్తోంది. ఇలాంటి పారిశ్రామిక క్లస్టర్ల అభివృద్ధితో పాటు.. పోర్టు ప్రాక్సిమల్ ప్రాంతంలో ఉన్న గ్రామాలను కలుపుకుని నగరాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నగరాలకు కావాల్సిన మౌలికసదుపాయాల నిర్మాణానికి.. సాగరమాల 2.0 నిధులు ఉపయోగించుకునేలా ప్రణాళికలు రచిస్తోంది.
నిర్మాణంలో ఉన్న, కొత్త పోర్టులు..
ఏపీలో ఇప్పటికే విశాఖపట్నం, కాకినాడ, గంగవరం, కృష్ణపట్నంలో పోర్టులు ఉన్న సంగతి తెలిసిందే. వీటికి అదనంగా.. మచిలీపట్నం, రామాయపట్నం, మూలపేట, కాకినాడ సెజ్లో కొత్త పోర్టులు నిర్మాణ దశలో ఉన్నాయి. అంతేకాకుండా నావల్ ఆల్టర్నేటివ్ ఆపరేషన్స్ కోసం రాంబిల్లిలో.. మరో పోర్టును నిర్మిస్తున్నారు. వీటికి అదనంగా నక్కపల్లి, దుగరాజపట్నంలో పోర్టులు నిర్మించాలని ప్రభుత్వం అనుకుంటోంది. ఇలా ప్రతి 50 కిలోమీటర్లకు ఓ పోర్టు లేదా ఫిషింగ్ హార్బర్లు, పోర్టు ఆధారిత పారిశ్రామిక క్లస్టర్లు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఇప్పటికే ఉన్న విశాఖపట్నం పోర్టు సమీపంలో సముద్ర ఆధారిత వాణిజ్యాన్ని ప్రోత్సహించేలా క్లస్టర్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు ఉన్నాయి. మూలపేట పోర్టు సమీపంలో రసాయన పరిశ్రమలు, వాటికి అనుబంధ కార్యకలాపాలు నిర్వహించే యూనిట్ల క్లస్టర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. రాంబిల్లిలో నిర్మిస్తున్న పోర్టు సమీపంలో రక్షణరంగ పరిశ్రమల కోసం క్లస్టర్.. కాకినాడలో పెట్రోలియం ఆయిల్, లూబ్రికెంట్స్ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు వీలుగా క్లస్టర్.. మచిలీపట్నంలో హెవీ ఇంజినీరింగ్, ఆటోమొబైల్ రంగానికి సంబంధించిన క్లస్టర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇలా రామాయపట్నం, కృష్ణపట్నం, దుగ్గరాజపట్నం వంటి పోర్టుల సమీపంలో.. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రంగాలకు చెందిన పారిశ్రామిక క్లస్టర్లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa