సినిమాల్లో హీరో చిన్నతనంలో విలన్పై కక్ష పెంచుకోవడం.. పెద్దయ్యాక విలన్పై పగ సాధించడం వంటి సీన్లు మనం చూస్తుంటాం. అదంతా రీల్ లైఫ్.. కానీ రియల్ లైఫ్లో ఓ కుర్రాడు తనకు చదువు చెప్పిన టీచర్ను విలన్గా భావించాడు.. ఆయన క్లాస్లో మందలించడంతో ఎలాగైనా కక్ష తీర్చుకోవాలనుకున్నాడు. ఎప్పుడో ఆరేళ్ల క్రితం టీచర్ అవమానించాడని ఇప్పుడు పగ తీర్చుకునే ప్రయత్నం చేశాడు. ఒకసారి టీచర్పై కత్తితో దాడి చేయగా గాయాలతో బయటపడ్డారు.. అప్పుడు ప్రాణపాయం తప్పింది. తాజాగా మరోసారి కూడా అదే ప్రయత్నం జరిగింది. విజయనగరం జిల్లా రామభద్రాపురం మండలంలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది.
సువ్వాడ వెంకట అప్పలనాయుడు 2019లో కోట శిర్లాం యూపీ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఆయన ప్రస్తుతం జుమ్మువలస ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడుగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే 2019లో కోట శిర్లాం యూపీ స్కూల్లో పనిచేస్తున్నప్పుడు ఎనిమిదో తరగతి విద్యార్థి(చందాపురానికి చెందిన వై.దిలీప్)ను మందలించారు. 'స్కూల్లో, క్లాస్ రూమ్లో నీ ప్రవర్తన బాగోలేదు.. బాగా చదువుకో' అంటూ దిలీప్ను టీచర్ అప్పలనాయుడు సున్నితంగా మందలించారు. 2019 తర్వాత ఈ వ్యవహారం ఎప్పుడూ తెరపైకి రాలేదు.
గతేడాది దాడి చేసిన దిలీప్
గతేడాది అక్టోబరు 4న దిలీప్ ప్రధానోపాధ్యాయుడు అప్పలనాయుడిపై కత్తితో దాడిచేసి గాయపరిచాడు. ఎప్పుడో 2019లో టీచర్ మందలించాడని.. ఇంకా కక్ష పెట్టుకున్నాడు. ఈ ఘటనపై గతేడాది ఈ కుర్రాడిపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అయినా సరే దిలీప్ పద్ధతి మారలేదు.. పదే, పదే టీచర్ అప్పలనాయుడ్ని బెదిరిస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా రెండు రోజుల క్రితం (శనివారం-నవంబర్ 8న) హెడ్మాస్టర్ అప్పలనాయుడు స్కూల్ నుంచి ఇంటికి వెళ్తుండగా మరోసారి దిలీప్ మధ్యలో అడ్డగించాడు. వెంటనే స్థానికులు గమనించడంతో ప్రమాదం తప్పింది.. ఆ తర్వాత కొంతమంది స్థానికులు ఆయనకు తోడుగా వచ్చి ఇంటికి పంపించారు. ఆ వెంటనే అప్పలనాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆ కుర్రాడికి మతిస్థిమితం లేదని.. తల్లిదండ్రులతో అతడి గురించి మాట్లాడి చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa