ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిటిషన్.. కేఏ పాల్‌పై సుప్రీం కోర్టు ఆగ్రహం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 10, 2025, 09:18 PM

గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన మెడికల్ కాలేజీల నిర్మాణాలను.. పీపీపీ మోడ్‌లో పూర్తి చేసి నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై ప్రతిపక్షాలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా వైసీపీ అధినేత జగన్ ప్రత్యేక యాత్ర కూడా తలపెట్టారు. ఇక ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌.. సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. అయితే ఈ విషయంలో తాజాగా కేఏ పాల్‌కు సుప్రీంలో చుక్కెదురు అయింది. కేఏ పాల్‌పై అత్యున్నత ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. మీడియాలో ప్రచారం కోసం పిటిషన్లు దాఖలు చేస్తున్నారని జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించాలని కేఏ పాల్‌కు సూచించింది.


ఇదొక్కటే కాదు.. గతంలో పలుమార్లు సుప్రీం కోర్టు మెట్లు ఎక్కారు కేఏ పాల్. 2024లో తిరుమలను కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలంటూ సుప్రీం కోర్టులో పాల్ పిటిషన్ వేశారు. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై దర్యాప్తుకు మూడు లేదా ఆరు నెలల కాలపరిమితి విధించాలని, తిరుమలలో హిందూ, క్రిస్టియన్ గొడవలు జరగకుండా ఉండాలంటే తిరుమలను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం.. డిస్మిస్ చేసింది. దేశంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయని ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.


ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లకు (ఈవీఎం) బదులు.. బ్యాలెట్ పేపర్లను వినియోగించాలంటూ 2024లో కేఏ పాల్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన ధర్మాసనం పిటిషన్‌ను కొట్టేసింది. ఈ సందర్భంగా.. మీరు ఎన్నికల్లో గెలిచినప్పుడు ఏం లేదు.. ఓడిపోయినప్పుడే ఈవీఎం ట్యాపరింగ్ ఆరోపణలు వస్తాయా అని ప్రశ్నించింది.


2023లో తెలంగాణ సెక్రటేరియట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంపై సీబీఐ విచారణ జరిపించాలని సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. అది అగ్నిప్రమాదం కాదని, నర బలి అని పిటిషన్‌లో పేర్కొన్నారు. అలాగే తన భద్రతను ప్రభుత్వం తొలగించిందని, దీంతో తనకు ప్రాణ హాని ఉందని కేఏ పాల్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన కోర్టు.. మీరొక రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి.. మీ ఉద్దేశం వేరు అని.. ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఒక దానితో మరొక అంశానికి ముడిపెట్టొద్దని చెప్పింది. సచివాలయంలో అగ్ని ప్రమాద ఘటనపై తాము జోక్యం చేసుకోలేమని చెప్పింది. ఈ సందర్భంగా దేశంలో జరిగే అగ్నిప్రమాదాలపై సీబీఐతో విచారణ జరిపించాలా.. అంటూ పిటిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పిటిషన్ కొట్టివేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa