పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో జిల్లా కోర్టు ముందు ఆత్మహుతి దాడి జరిగి 12 మంది మరణించిన ఘటన ఆ దేశంలో తీవ్ర భద్రతా ఆందోళనలను రేకెత్తించింది. ఈ దుర్ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే.. పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ సంచలన ఆరోపణలకు తెరతీశారు. ఈ దాడి వెనుక భారత్ హస్తం ఉందని సాక్ష్యాధారాలు లేకుండానే తీవ్ర ఆరోపణలు గుప్పించారు. పాకిస్తాన్ ప్రభుత్వ వార్తా సంస్థ అయిన ఏపీపీ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇస్లామాబాద్ కోర్టు వద్ద జరిగిన కారు పేలుడు దాడికి, ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దు సమీపంలోని వానా నగరంలో ఉన్న కేడెట్ కాలేజీపై జరిగిన దాడికి భారత్ ప్రేరేపిత ఉగ్రవాద ప్రాక్సీలే కారణమని ఆయన తీవ్ర ఆరోపలు చేశారు.
పాకిస్తాన్ను అస్థిరపరచాలనే లక్ష్యంతో భారత్ చేపడుతున్న ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదానికి ఈ దాడులు కొనసాగింపు అని పేర్కొన్నారు. అఫ్ఘనిస్థాన్ భూభాగం నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న తాలిబన్ నెట్వర్క్ అమాయక పిల్లలపై కూడా దాడి చేసిందని ఆరోపించారు. భారత ఆశ్రయం కింద అఫ్ఘానిస్థాన్ గడ్డపై నుంచి జరుగుతున్న ఈ దాడులను ఎంత ఖండించినా తక్కువేనని షరీఫ్ నిరాధార ఆరోపణలు చేశారు.
ఈ సందర్భంగా భారత్, తాలిబన్లను ఉద్దేశించి షెహబాజ్ షరీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అఫ్గాన్ తాలిబన్ పాలనను భారతదేశ ఏజెంట్గా ఆయన అభివర్ణించారు. తెహ్రిక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్ను కూడా భారత్తో ముడిపెట్టడానికి ఫితా అల్ హిందూస్తాన్ అని పిలవడం గమనార్హం. ఇస్లామాబాద్ పేలుడు జరిగిన కొన్ని గంటల్లోనే షెహబాజ్ షరీఫ్ ఇలాంటి ఆరోపణలు చేయడం గమనార్హం.
మరోవైపు పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఇస్లామాబాద్లో జరిగిన ఈ ఆత్మహుతి దాడిని పాకిస్తాన్కు ఒక మేల్కొలుపుగా అభివర్ణించారు. ప్రస్తుతం పాకిస్తాన్ యుద్ధ స్థితిలో ఉందని.. ఈ పోరాటం అఫ్గాన్-పాక్ సరిహద్దు (డ్యూరాండ్ లైన్)కే పరిమితం కాదని ఆయన తీవ్ర హెచ్చరికలు చేశారు. ఇక ఈ పేలుడుకు కాబూల్ పాలకులదే (తాలిబన్ ప్రభుత్వం) కారణమని ఖ్వాజా ఆసిఫ్ తేల్చిచెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో అఫ్గాన్ తాలిబన్ ప్రభుత్వంతో శాంతి చర్చల్లో పురోగతి ఆశించడం అవాస్తవం అని ఆయన స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa