ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న ప్రతిష్ఠాత్మక 'పార్టనర్షిప్ సమ్మిట్'కు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు. సదస్సు భద్రతా ఏర్పాట్లపై ఆమె నిన్న ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.ఈ సదస్సుకు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో పాటు పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా అత్యంత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయాలని మంత్రి స్పష్టం చేశారు.సదస్సు జరిగేన్ని రోజులు విశాఖ నగరాన్ని పూర్తిగా డ్రోన్లు, సీసీ కెమెరాల నిఘా నీడలో ఉంచాలని ఆమె సూచించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అగ్నిమాపక బృందాలు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సర్వసన్నద్ధంగా ఉంచాలన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం, వదంతులు వ్యాప్తి చెందకుండా ప్రత్యేక నిఘా పెట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. భద్రతా ఏర్పాట్లలో అన్ని ప్రభుత్వ శాఖల మధ్య పూర్తి సమన్వయం ఉండేలా చూడాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa