ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో రూ. 27 వేల కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 12, 2025, 07:42 PM

ఏపీకి భారీ పెట్టుబడులు రానున్నాయి. ఇటీవల అమరావతి సచివాలయంలో జరిగిన 12వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) సమావేశంలో.. వివిధ కంపెనీలు సమర్పించిన రూ. 1,01,899 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదం లభించిన సంగతి తెలిసిందే. తాజాగా అందులో పలు ఐటీ, ఎలక్ట్రానిక్స్ కంపెనీలకు సంబంధించి దాదాపు రూ. 27 వేల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలను ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఆయా కంపెనీలకు భూముల కేటాయింపు, ప్రోత్సాహకాలు చెల్లించేందుకు అనుమతులు జారీ చేసింది. అంతేకాకుండా రాయితీ ధరలపై భూములు కేటాయించే ప్రతిపాదనలకు కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ కంపెనీల ద్వారా దాదాపు 44 వేల మంది ఉద్యోగావకాశాలు లభిస్తాయని అంచనా.


క్వార్క్స్‌ టెక్నోసాఫ్ట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే కంపెనీ విశాఖపట్నంలో రూ. 115 కోట్ల పెట్టుబడితో ఐటీ క్యాంపస్‌ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ కంపెనీ ద్వారా 2 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని ప్రభుత్వం చెబుతోంది. ఈ కంపెనీకి ఏపీ ఐటీ, జీసీసీ పాలసీ 4.0 కింద ప్రోత్సాహకాలు, రాయితీలు చెల్లించేందుకు ఆమోదం తెలిపింది. ఈ కంపెనీకి కాపులుప్పాడ దగ్గర ఎకరా రూ. కోటి చొప్పున 4 ఎకరాలను కేటాయించింది. అయితే తొలి దశ కార్యకలాపాల ప్రారంభానికి రండేళ్ల గడువు విధించింది.


విశాఖపట్నం మధురవాడ దగ్గర రూ. 2,200 కోట్లతో ఐటీ పార్కు అభివృద్ధికి.. విశాఖ రియాల్టీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్రతిపాదనను ఆమోదించింది. ఈ సంస్థ ద్వారా 30 వేల మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం చెబుతోంది. ఆ సంస్థకు ప్రోత్సాహకాలు, రాయితీలు చెల్లించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మధురవాడ ఐటీ హిల్స్‌లో ఏఎన్‌ఎస్‌ఆర్‌ గ్లోబల్‌ కార్పొరేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ. 1,000 కోట్లతో గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ సిటీ క్యాంపస్‌ ఏర్పాటు చేయడానికి 33 ఏళ్ల లీజు ప్రాతిపదికన 10.29 ఎకరాలను కేటాయించింది. 10 వేల మందికి ఉపాధి కల్పించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. కాగా, లీజు వ్యవధిని 99 ఏళ్లకు పెంచడానికి కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపింది.


మరోవైపుకర్నూలు జిల్లా ఓర్వకల్లులో రూ. 22,976 కోట్లతో ఇండిచిప్‌ సెమీకండక్టర్స్‌ లిమిటెడ్‌ సంస్థ.. సిలికాన్‌ కార్బైడ్‌ డివైజ్‌ తయారీ యూనిట్‌ ఏర్పాటు చేసేందుకు ఇచ్చిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఈ కంపెనీ అందుబాటులోకి వస్తే.. 1,241 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు అంచనా. ఉపాధి కల్పిస్తున్నందున ఆ కంపెనీకి ప్రోత్సాహకాలను చెల్లించేందుకు అనుమతించింది. ఆ సంస్థకు రూ. 10 లక్షల చొప్పున 150 ఎకరాలు కేటాయించింది. తిరుపతి జిల్లాలోని శ్రీ సిటీలో రూ. 550 కోట్లతో బీఎల్‌డీసీ మోటార్లు, రాగి ట్యూబ్‌ల తయారీ యూనిట్‌ ఏర్పాటుకు ఎస్‌సీఐసీ వెంచర్స్‌ ఎల్‌ఎల్‌పీ సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు అనుమతులు మంజూరు చేసింది. ఈ కంపెనీ 1,130 మందికి ఉపాధి కల్పించనున్నట్లు సంస్థ పేర్కొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa