అమరావతి నిర్మాణ పనులను వేగవంతం చేసే దిశగా కూటమి ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. గతంలో నిలిచిపోయిన అభివృద్ధి పనులను తిరిగి ప్రారంభించేందుకు అవసరమైన నిధుల సమీకరణపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా, వివిధ ఆర్థిక సంస్థల నుంచి మొత్తం రూ.9,000 కోట్ల రుణాలు తీసుకునేందుకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతిలో మౌలిక వసతుల కల్పనను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం, ఈ నిధులతో పనులకు కొత్త ఊపు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీపీఎఫ్సీఎల్) ద్వారా రూ.1,500 కోట్ల రుణం పొందేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నిధులను పూర్తిగా అమరావతి నగరంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం వినియోగించనున్నారు. ఈ రుణ ఒప్పందం, ఇతర అవసరమైన చర్యలు తీసుకునే పూర్తి బాధ్యతలను ఏపీ సీఆర్డీఏ కమిషనర్కు అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా, నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ (నాబ్ఫిడ్) నుంచి మరో రూ.7,500 కోట్ల భారీ రుణం తీసుకునేందుకు కూడా ఆమోదం తెలిపింది. ఈ రుణానికి రాష్ట్ర ప్రభుత్వమే హామీ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులను అమరావతిలోని 4, 9, 12 జోన్లలో అభివృద్ధి పనులు, ప్రభుత్వ భవన సముదాయాల నిర్మాణం, ల్యాండ్ పూలింగ్ పథకం, ఇతర మౌలిక వసతుల కోసం వినియోగించాలని ప్రభుత్వం నిర్దేశించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa