కృష్ణా జిల్లాలో 11 ఏళ్ల క్రితం జరిగిన ఓ హత్య కేసులో ఎట్టకేలకు తీర్పు వెలువడింది. పాత కక్షల నేపథ్యంలో ఒక వ్యక్తిని దారుణంగా హత్య చేసిన కేసులో ఏడుగురు నిందితులను దోషులుగా తేల్చిన కోర్టు, వారికి జీవిత ఖైదు విధిస్తూ గురువారం తీర్పు చెప్పింది. ఒక్కొక్కరికీ రూ. 2 వేల చొప్పున జరిమానా కూడా విధించింది. ఈ కేసుకు సంబంధించి జడ్జి జి. గోపి తుది తీర్పును వెల్లడించారు.ప్రాసిక్యూషన్ అందించిన వివరాల ప్రకారం మచిలీపట్నం మండలం గొల్లగూడేనికి చెందిన కాగిత రామ్మోహనరావుకు, అదే గ్రామానికి చెందిన కొందరితో పాత గొడవలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో, 2013 ఫిబ్రవరి 28వ తేదీ రాత్రి రామ్మోహనరావు తన గడ్డివాము వద్ద ఒంటరిగా ఉన్నప్పుడు నిందితులు ఆయనపై దాడికి పాల్పడ్డారు. కత్తులు, కర్రలతో విచక్షణారహితంగా దాడి చేయడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మొత్తం తొమ్మిది మందిని నిందితులుగా చేర్చారు. సుదీర్ఘ కాలం పాటు సాగిన ఈ కేసు విచారణలో భాగంగా పోలీసులు కోర్టు ముందు సాక్ష్యాధారాలను ప్రవేశపెట్టారు. కేసు విచారణ జరుగుతున్న సమయంలోనే నిందితుల్లో ఒకరైన శొంఠి వీరబాబు, మరొక నిందితుడైన కాగిత ఆంజనేయులు మరణించారు.మిగిలిన ఏడుగురు నిందితులపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి వారికి శిక్ష ఖరారు చేశారు. శొంఠి పెదవైడేశ్వరరావు, బొర్రా శ్రీనివాసరావు, బొర్రా స్వయంకృష్ణ, కాగిత సోమయ్య, శొంఠి వీరవెంకటేశ్వరరావు, శొంఠి వీరాంజనేయులు, శొంఠి ముసలయ్యలను దోషులుగా నిర్ధారించి జీవిత ఖైదు, జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. దీంతో పుష్కర కాలం నాటి కేసులో మృతుడి కుటుంబానికి న్యాయం జరిగినట్లయింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa