విశాఖపట్నంలో నిర్వహిస్తున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుతో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు ఏపీ ప్రభుత్వంతో పెట్టుబడులపై ఒప్పందాలు చేసుకున్నాయి. మొత్తం 40 దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. ఒకరోజు ముందుగానే ముఖ్యమంత్రి చంద్రబాబు 15 సమావేశాల్లో పాల్గొని ప్రతినిధులతో చర్చించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. అయితే సదస్సుకు ముందుగానే రూ.3.65 లక్షల కోట్ల విలువైన 35 అవగాహన ఒప్పందాలు జరిగాయని చెబుతున్నారు. ఈ రెండు రోజులు మరిన్ని ఒప్పందాలు జరుగుతాయని చెబుతున్నారు.
ఏపీలో రిలయన్స్ సంస్థ పెట్టుబడులు
రిలయెన్స్ ఇండస్ట్రీ సంస్థ ఈడీ ఎంఎస్ ప్రసాద్, ఆర్ఐఎల్ సౌతిండియా మెంటార్ మాధవరావుతో సీఎం చంద్రబాబు భేటీ
ఏపీలో పెట్టుబడులకు సంబంధించి కీలక అంశాలపై చర్చ.
ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు రిలయెన్స్ సంస్థ అంగీకారం
ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడిదారులను ఆకర్షించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుంటారన్నారు ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్. ఏపీలో ప్రశాంతమైన వాతావరణం ఉందని.. వ్యాపార అనుకూల రాష్ట్రంగా నిలిచిందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొందన్నారు. మళ్లీ రాష్ట్రం తిరిగి గాడిలో పడుతుందన్నారు. ప్రపంచ నలుమూలల నుంచి వచ్చి రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నారని.. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తోనే పెట్టుబడులు వస్తాయన్నారు. చంద్రబాబు మూడు దశాబ్దాలుగా తనకు స్నేహితుడని.. ఆయన సారథ్యంలో ఏపీకి అనేక పెట్టుబడులు వచ్చాయన్నారు. లక్ష్యం పెట్టుకోవడం సులభం.. అక్కడికి చేరుకోవడం కష్టమన్నారు.
విశాఖపట్నానికి దేశంలోనే అందమైన నగరంగా పేరుందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. విశాఖలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో ప్రసంగించారు. ఈ సీఐఐ భాగస్వామ్య సదస్సుకు 72 దేశాల ప్రతినిధులు వచ్చారన్నారు. ఆంధ్రప్రదేశ్ దేశానికి గేట్వేలా మారుతోందన్నారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయన్నారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఐటీలో తెలుగువాళ్లే ముందుంటారన్నారు. ఏపీకి డ్రోన్ సిటీ, ఎలక్ట్రానిక్స్ సిటీ, క్వాంటమ్ వ్యాలీ, స్పేస్ సిటీ, గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ వస్తున్నాయన్నారు. సోలార్, విండ్, పంప్డ్ ఎనర్జీలో ఆంధ్రప్రదేశ్ ముందుందన్నారు.
ఏపీకి రూ.లక్షా10వేల కోట్ల పెట్టుబడి
ఆంధ్రప్రదేశ్కు మరో భారీ పెట్టుబడి వచ్చిందని మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. బ్రూక్ఫీల్డ్ అసెట్ మేనేజ్మెంట్ రూ.లక్షా పది వేల కోట్ల పెట్టుబడి పెడుతోందని తెలిపారు. పునరుత్పాదక విద్యుత్, బ్యాటరీ, పంప్డ్ స్టోరేజ్ రంగాల్లో బ్రూక్ఫీల్డ్ పెట్టుబడులు పెడుతున్నట్లు చెప్పారు. రియల్ఎస్టేట్, బీసీసీలు, ఇన్ఫ్రా, పోర్టుల్లోనూ పెట్టుబడులు వస్తున్నట్లు ట్వీట్ చేశారు.
విశాఖపట్నంలో సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభం
విశాఖపట్నంలో ప్రతిష్ఠాత్మక 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభమైంది. ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ఈ సదస్సును ప్రారంభించారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రులు పీయూష్గోయల్, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాస వర్మ పాల్గొన్నారు. ఈ సదస్సుకు మరికొందరు ప్రముఖులు, దేశవిదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు.
కుప్పానికి మరో పరిశ్రమ
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం గుడుపల్లెలో రూ.898.88 కోట్ల పెట్టుబడి వచ్చింది. ఈ మేరకు హ్వాసంగ్ కంపెనీ గ్రీన్ఫీల్డ్ నాన్లెదర్ ఫుట్వేర్ తయారీ యూనిట్ ఏర్పాటుకు ప్రభుత్వం 100 ఎకరాలు కేటాయించింది. రెంట్ ఫ్రీ లీజు పద్ధతిలో 50 ఏళ్లపాటు ఇచ్చి, సెజ్ హోదా కల్పించనుంది. ఈ కంపెనీ ఏర్పాటుతో 17,645 మందికి ఉపాధి లభించనుంది.
మడకశిరలో భారత్ ఫోర్జ్ రూ.2వేల కోట్ల పెట్టుబడి
శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో భారత్ ఫోర్జ్ రక్షణరంగ ఉత్పత్తుల తయారీ కేంద్రం ఏర్పాటు చేస్తోంది. వీరు దశలవారీగా రూ.2,000 కోట్ల పెట్టుబడులు పెడతారు. ఇది ఆరంభం మాత్రమేనని.. భవిష్యత్తులో ఏపీతో అనుబంధం కొనసాగుతుందని, వివిధ రంగాల్లో పెట్టుబడులు పెడతామన్నారు భారత్ ఫోర్జ్ వైస్ఛైర్మన్, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్, సీఐఐ ఐరోపా కౌన్సిల్ ఛైర్మన్ అమిత్ కల్యాణి.
రెన్యూ ఎనర్జీ రూ.82వేల కోట్ల పెట్టుబడి
వచ్చే నాలుగైదేళ్లలో వివిధ రకాల గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల్లో రూ.82వేల కోట్ల పెట్టుబడులు పెడతామని రెన్యూ ఎనర్జీ వ్యవస్థాపక ఛైర్మన్, సీఈఓ సుమంత్ సిన్హా తెలిపారు. ఏపీ ప్రభుత్వంతో గురువారం రూ.60వేల కోట్ల పెట్టుబడులకు ఎంఓయూలు చేసుకున్నారు. విశాఖకు సమీపంలో వేఫర్ల (సౌర విద్యుత్ ఫలకాల తయారీలో వాడే పలుచటి సిలికాన్ పొర) తయారీ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తారు. రాష్ట్రంలో ఒక పోర్టుకు సమీపంలో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు పెడతారు.
ఏపీలో రూ.15వేల కోట్ల పెట్టుబడి
‘హీరో ఫ్యూచర్ ఎనర్జీస్’ సంస్థ పునరుత్పాదకత విద్యుత్తు రంగంలో 4 గిగావాట్ల సామర్థ్యంతో రూ.15 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది.అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో విద్యుత్తు ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ఈ సంస్థ ముందుకు వచ్చింది. సంస్థ సీఎండీ రాహుల్ ముంజాల్ గురువారం సీఎం చంద్రబాబుతో విశాఖలో భేటీ అయ్యారు.
సీఐఐ భాగస్వామ్య సదస్సుకు ముందే కీలక ఒప్పందాలు
విశాఖపట్నంలో సీఐఐ భాగస్వామ్య సదస్సుకు ఒకరోజు ముందే రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చాయి. ప్రముఖ పారిశ్రామికవేత్తలు, సంస్థల ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. వివిధ రంగాల్లో 35 సంస్థలు రూ.3,65,304 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సీఎం సమక్షంలో ఎంఓయూలు చేసుకున్నారు.
సీఐఐ సదస్సు వేదికపై 21మంది అతిథులు
విశాఖపట్నం సీఐఐ సదస్సులో భాగంగా.. ప్రధాన హాల్లో నిర్వహించే సదస్సు వేదికపై 21 మంది అతిథులు ఆశీనులయ్యారు. ఉపరాష్ట్రపతి, గవర్నర్, సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, రామ్మోహన్నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాసవర్మ, రాష్ట్ర మంత్రి లోకేశ్తో పాటూ పారిశ్రామికవేత్తలు ఉంటారు. రెండు రోజులపాటు నాలుగు హాళ్లలో 32 సెషన్లు జరగనున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa