ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీహార్ ఎన్నికల్లో ప్రశాంత్ కిశోర్ పార్టీకి చుక్కెదురు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 14, 2025, 07:41 PM

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌కు, మహాకూటమి డిప్యూటీ సీఎం అభ్యర్థి ముకేశ్ సహానీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. శుక్రవారం మధ్యాహ్నం 3:50 గంటల వరకు వెలువడిన ట్రెండ్స్ ప్రకారం, ప్రశాంత్ కిశోర్‌కు చెందిన జన్ సురాజ్ పార్టీ, ముకేశ్ సహానీకి చెందిన వికాశీల్ ఇన్సాన్ పార్టీ  ఒక్క స్థానంలోనూ ఆధిక్యం ప్రదర్శించలేకపోయాయి.ఈ ఎన్నికల్లో ప్రశాంత్ కిశోర్ పార్టీ 'ఎక్స్ ఫ్యాక్టర్'గా నిలుస్తుందని చాలామంది భావించారు. గతంలో 2015లో నితీశ్ కుమార్, 2019లో ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అధినేత జగన్, 2021లో పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ విజయాల్లో కీలక పాత్ర పోషించిన పీకే.. సొంత రాష్ట్రంలో సొంత పార్టీని గెలిపించుకోలేకపోయారు. ఎగ్జిట్ పోల్స్ కూడా జన్ సురాజ్ పార్టీకి 0 నుంచి 2 సీట్లు వస్తాయని అంచనా వేయగా, ప్రస్తుత ట్రెండ్స్ దానికి తగ్గట్టే ఉన్నాయి. కౌంటింగ్‌కు ముందు ప్రశాంత్ కిశోర్ కూడా తన పార్టీ అద్భుతంగా రాణిస్తుందని లేదా పూర్తిగా విఫలమవుతుందని వ్యాఖ్యానించడం గమనార్హం.మరోవైపు, మహాకూటమి తరఫున డిప్యూటీ సీఎం అభ్యర్థిగా ఉన్న ముకేశ్ సహానీ పార్టీ వీఐపీ కూడా దారుణంగా విఫలమైంది. ఆ పార్టీ పోటీ చేసిన 15 స్థానాల్లోనూ వెనుకంజలో ఉంది. సహానీ స్వయంగా పోటీ చేయనప్పటికీ, ఆయన సోదరుడు సంతోష్ సహానీ గౌరా గ్రామ్ నియోజకవర్గంలో 12 మంది అభ్యర్థుల్లో ఎనిమిదో స్థానంలో నిలిచారు. మిథిలాంచల్, సీమాంచల్ ప్రాంతాల్లో మల్లా, సహానీ, నిషద్ వర్గాల ఓట్లను కూడగట్టడంలో కీలక పాత్ర పోషిస్తారని భావించిన సహానీ వైఫల్యం మహాకూటమికి పెద్ద దెబ్బగా మారింది.తాజా ట్రెండ్స్ ప్రకారం, ఎన్డీఏ కూటమి 209 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకెళుతుంగా, మహాకూటమి కేవలం 29 స్థానాలకే పరిమితమైంది. బీహార్‌లో ఈసారి రెండు దశల్లో 66.91 శాతం పోలింగ్ నమోదైంది. 1951 తర్వాత ఇదే అత్యధికం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa