చాయ్వాలాగా జీవితం ప్రారంభించిన నరేంద్ర మోదీ ఈరోజు దేశానికి ప్రధానమంత్రి కాగలిగారంటే అందుకు కారణం భారత రాజ్యాంగం కల్పించిన అవకాశాలేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. దేశాన్ని ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో నిలబెట్టేందుకు ప్రధాని మోదీ నిరంతరం కృషి చేస్తున్నారని ఆయన ప్రశంసించారు. ఆదివారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో 'భారత రాజ్యాంగం - 75 సంవత్సరాలు' అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.ఈ కార్యక్రమానికి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయ్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, తాను ముఖ్యమంత్రిగా, జస్టిస్ గవాయ్ సీజేఐగా, జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఏపీ హైకోర్టు సీజేగా తమ విధులను నిర్వర్తిస్తున్నామంటే అదంతా రాజ్యాంగం కల్పించిన గొప్ప అవకాశమేనని పేర్కొన్నారు.సీజేఐ జస్టిస్ గవాయ్పై చంద్రబాబు ప్రత్యేక ప్రశంసలు కురిపించారు. జస్టిస్ గవాయ్ మహారాష్ట్రలోని అమరావతి ప్రాంతం నుంచి వచ్చారని గుర్తుచేశారు. అత్యున్నత పదవిలో ఉన్నప్పటికీ ఆయన ఎంతో నిరాడంబరంగా ఉంటారని, ఎల్లప్పుడూ సమానత్వానికి ప్రాధాన్యత ఇస్తారని కొనియాడారు. "జస్టిస్ గవాయ్ చాలా మంచి మనసున్న వ్యక్తి. ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకునే గొప్ప తీర్పులను ఆయన వెలువరించారు" అని చంద్రబాబు అన్నారు.భారతదేశ భవిష్యత్తుపై చంద్రబాబు బలమైన విశ్వాసం వ్యక్తం చేశారు. "ప్రపంచంలోని అనేక దేశాలు యువత కొరతతో ఇబ్బందులు పడుతున్నాయి. కానీ, మన దేశంలో ఆ సమస్య లేదు. అపారమైన మానవ వనరులు మన సొంతం. సంస్కరణల తర్వాత ప్రజల ఆలోచనా విధానంలో మార్పు వచ్చింది. 2047 నాటికి ప్రపంచవ్యాప్తంగా భారతీయులు అత్యంత ప్రభావశీల శక్తిగా ఎదుగుతారన్న నమ్మకం నాకుంది" అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.సమాజంలో తప్పులు జరిగినప్పుడు వాటిని సరిదిద్ది, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో న్యాయవ్యవస్థ పాత్ర అత్యంత కీలకమని చంద్రబాబు నొక్కిచెప్పారు. ఆధునిక కాలంలో సోషల్ మీడియా ప్రభావంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. "సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ ఎడిటర్గా మారిపోతున్నారు. ఇష్టానుసారంగా వ్యక్తిగత దాడులకు పాల్పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశ ప్రయోజనాలకే ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలి" అని ఆయన పిలుపునిచ్చారు.డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ప్రసాదించిన 'ఒక వ్యక్తి-ఒక ఓటు' హక్కు ఒక గొప్ప వరమని చంద్రబాబు అభివర్ణించారు. "కొన్ని దేశాల్లో ఇప్పటికీ ప్రజలకు సమాన ఓటు హక్కు లేదు. కానీ, భారతదేశంలో పేద, ధనిక, స్త్రీ, పురుష బేధం లేకుండా అందరికీ సమాన ఓటు హక్కు ఉంది" అని ఆయన వివరించారు. సామాజిక, ఆర్థిక సమానత్వం ఉన్న సమాజాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని, ప్రభుత్వ విధానాలు ఈ సమానత్వాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆయన తెలిపారు. "ఆరోగ్యకరమైన, సంపన్నమైన, సంతోషకరమైన సమాజాన్ని నిర్మించాలన్నదే నా ప్రణాళిక. ఇందుకు ప్రతి ఒక్కరి సహకారం కోరుతున్నాను" అని చంద్రబాబు తన ప్రసంగాన్ని ముగించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa