ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాలికను అక్రమంగా 2 నెలలు గదిలో బంధించిన వ్యక్తిపై కేసు నమోదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 18, 2025, 07:58 PM

ప్రభుత్వాలు ఎన్ని రకాల చర్యలు చేపడుతున్నా సరిహద్దుల నుంచి దేశంలోని అక్రమ వలసలు కొనసాగుతున్నాయి. అక్రమంగా మనదేశంలోకి ప్రవేశించిన వారు.. ఏకంగా గుర్తింపు కార్డులు కూడా అక్కడక్కడా పొందుతున్న పరిస్థితి. ఈ క్రమంలోనే తాజాగా అనకాపల్లిలో ఓ ఘటన వెలుగుచూసింది. ఓ బాలికను పెళ్లి చేస్తానని నమ్మించిన వ్యక్తి.. బంగ్లాదేశ్ బాలికను కాకినాడ జిల్లాకు తీసుకువచ్చాడు.. ఆ బాలికను రెండు నెలల పాటు బంధించాడు. చివరకు పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. విక్రమ్ అలీది బంగ్లాదేశ్. 13 ఏళ్ల కిందట అంటే 2012లో మనదేశంలోకి అక్రమంగా ప్రవేశించాడు. యూపీలోని అలీఘడ్ చేరుకున్న విక్రమ్ అలీ.. అప్పటి నుంచి అక్కడే నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత స్థానికంగా ఉంటున్నట్లు ఆధార్ కార్డు కూడా సంపాదించుకున్నాడు.


అయితే ఇటీవల బంగ్లాదేశ్‌కు చెందిన బాలికతో విక్రమ్ అలీకి పరిచయం అయ్యింది. దీంతో మాయమాటలు చెప్పి.. పెళ్లి చేస్తానని నమ్మించి బంగ్లాదేశ్ బాలికను కాకినాడ జిల్లా దుమ్మలపేటకు తెచ్చాడు విక్రమ్ అలీ. రెండు నెలల కిందట ఆమెను దుమ్ములపేటకు తీసుకువచ్చి ఓ ఇంట్లో బంధించాడు. అయితే శనివారం రోజున బాలికతో కలసి రైళ్లో వెళ్తున్న సమయంలో అనకాపల్లి పోలీసులకు సమాచారం అందింది. దీంతో అనకాపల్లి రైల్వేస్టేషన్‌ వద్దకు శనివారం రాత్రి పోలీసులు చేరుకున్నారు.


రైల్వేస్టేషన్ వద్ద విక్రమ్ అలీతో పాటుగా బాలికను అదుపులోకి తీసుకున్నారు. విచారణ తర్వాత అక్రమంగా బంగ్లాదేశ్ నుంచి భారతదేశంలోకి ప్రవేశించినందుకు విక్రమ్ అలీతో పాటుగా ఆ బాలికపైనా కేసు నమోదుచేశారు. మరోవైపు బాలికను నిర్బంధించినందుకు విక్రమ్‌ అలీపై అనకాపల్లి పోలీసులు పోక్సో కేసు కూడా నమోదు చేశారు. అనంతరం కోర్టు ఎదుట హాజరుపర్చగా.. కోర్టు రిమాండ్ విధించింది. దీంతో జైలుకు తరలించారు. మరోవైపు బంగ్లాదేశ్ బాలికను బాలికల సంరక్షణ కేంద్రానికి తరలించారు.


అప్పు చెల్లించలేదని మహిళ కిడ్నాప్


మరోవైపు అప్పు కట్టలేదని మహిళను కిడ్నాప్ చేసి హింసించిన ఘటన పీఎంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలానికి చెందిన ఓ కుటుంబం పీఎంపాలెంలో అపార్టుమెంట్లో నివసిస్తోంది. రియల్‌ ఎస్టేట్ వ్యాపారం చేసే ఆ మహిళ.. భూముల కొనుగోలు కోసం పవన్‌కుమార్‌ అనే వ్యక్తి వద్ద 2018లో పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్నారు. అయితే లావాదేవీలు జరగకపోవటంతో డబ్బు వెనక్కి చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో కొంత భూమిని వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు. మరో 15 లక్షలు బాకీ మిగలగా.. 15 నెలల్లో ఇస్తామని గతంలో ఒప్పందం చేసుకున్నారు.


అయితే గడువు ముగియటంతో ఆదివారం రోజు పవన్ కుమార్ కుటుంబసభ్యులు.. ఆ మహిళను పోలీస్ స్టేషన్ వెళ్దామని చెప్పి, గదిలో బంధించారు. ప్లాస్టిక్ పైపుతో దాడి చేశారు. అయితే చాకచక్యంగా వారి నుంచి తప్పించుకున్న మహిళ సోమవారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పవన్ కుమార్ కుటుంబసభ్యులు ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa