ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరో ఎన్‌కౌంటర్‌లో దేవ్‌జీ సహా ఏడుగురు మావోయిస్టులు హతం!

Crime |  Suryaa Desk  | Published : Wed, Nov 19, 2025, 09:05 PM

ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టుల వేట కొనసాగుతోంది. ఇప్పటికే మావోయిస్టు అగ్రనేత మాడ్వి హిడ్మా పోలీసుల ఎదురు కాల్పుల్లో మృతిచెందారు. ఇప్పుడు మళ్లీ మారేడుమిల్లి దద్దలిద్దింది. బుధవారం (నవంబర్ 19) తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఏడుగులు మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. వీరంతా ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వారుగా సమాచారం. అయితే అందులో మావోయిస్టు మరో అగ్రనేత దేవ్‌జీ అలియాస్ తిప్పిరి తిరుపతి.. ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈ ఎన్‌కౌంటర్‌ను ఏపీ ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేశ్ చంద్ర లడ్డా ధ్రువీకరించారు. మావోయిస్టుల మృతదేహాలను రంపచోడవరం ఆసుపత్రికి తరలించారు పోలీసులు.


ఈ ఎన్‌కౌంటర్ గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని మహేష్ చంద్ర లడ్డా చెప్పారు. ఈ మేరకు విజయవాడలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. మిగతా మావోయిస్టులు లొంగిపోవడం మంచిదన్న లడ్డా.. మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ నుంచి ఆంద్రప్రదేశ్‌కు రావడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. అయితే వారి కదలికలపై నిఘా పెట్టామన్నారు. నవంబరు 17న ఒక ఆపరేషన్‌ లాంచ్‌ చేసినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో 18వ తేదీ ఉదయం అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎదురుకాల్పులు జరిగాయని.. హిడ్మా సహా ఆరుగురు మావోయిస్టులు చనిపోయారని వెల్లడించారు.


ఇదిలా ఉండగా, ఎన్టీఆర్‌, కృష్ణా, ఏలూరు, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో ఇప్పటికే 50 మంది మావోయిస్టులను అరెస్టు చేసినట్లు మహేష్ చంద్ర లడ్డా తెలిపారు. వీరిలో స్పెషల్ జోనల్‌ కమిటీ సభ్యులు ముగ్గురు, ప్లాటూన్‌ సభ్యులు 23 మంది, డివిజినల్‌ కమిటీ సభ్యులు ఐదుగురితో పాటు ఏరియా కమిటీ సభ్యులు 19 మంది ఉన్నారని పేర్కొన్నారు. స్థానిక ప్రజలకు ఎలాంటి హాని జరగకుండా మావోయిస్టులను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. మావోయిస్టుల దగ్గరి నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కాగా, హిడ్మా ఎన్‌కౌంటర్‌ తర్వాత కొందరు మావోయిస్టులు పారిపోయారని.. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.


పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో దేవ్ జీ అలియాస్ తిప్పిరి తిరుపతి ఉన్నారా, ఎన్‌కౌంటర్‌లో చనిపోయారా అనే విషయంపై క్లారిటీ లేదు. ఇంతకుముందు దేవ్‌జీ.. పోలీసుల అదుపులోనే ఉన్నట్లు ప్రచారం జరిగినా.. ఆయన వివరాలు మాత్రం అందుబాటులోకి రావడం లేదు. అయితే ఆయన పోలీసుల అదుపులోనే ఉన్నాడని పౌర హక్కుల, సీపీఐ(ఎం-ఎల్) న్యూడెమోక్రసీ నేతలు వాదిస్తున్నారు. తమ అదుపులోకి తీసుకున్న తిప్పిరి తిరుపతి సహా మిగతా మావోయిస్టులను.. పోలీసులు వెంటనే కోర్టులో హాజరుపరచాలని సీపీఐ(ఎం-ఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి పి సూర్యం డిమాండ్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa