ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో దివ్యాంగ విద్యార్థులకు పూర్తిగా ఫ్రీ.. రూపాయి కట్టక్కర్లేదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 19, 2025, 09:09 PM

దివ్యాంగుల కోసం ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపడుతూ ఉంటాయి. వారికి స్వయం ఉపాధి కల్పించేందుకు చర్యలు చేపట్టడంతో పాటుగా ఆర్థికంగా, ఆరోగ్య పరంగా వారికి అండగా ఉండేలా చర్యలు, పథకాలు అమలు చేస్తుంటాయి. ఈ క్రమంలోనే ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు అండగా ఉండేందుకు వారికి అవసరమైన పరికరాలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 6 ఏళ్ల నుంచి 18 ఏళ్లు వయసు గల మానసిక వైకల్యంతో బాధపడేవారు.. శారీరక వైకల్యంతో ఇబ్బందులు పడేవారు, వినికిడి లోపం, సెరిబ్రల్ పాల్సీ వంటి సమస్యలతో బాధపడే విద్యార్థులకు పరికరాలు ఇవ్వాలని నిర్ణయించింది. ప్రత్యేక శిబిరాలను నిర్వహించి వారికి వైకల్య నిర్ధరణ పరీక్షలు నిర్వహించి.. అనంతరం వారికి అవసరమైన పరికరాలు అందిస్తారు. అయితే ప్రస్తుతం దీనిని ఉమ్మడి కర్నూలు జిల్లాలో అమలు చేస్తున్నారు.


కర్నూలు జిల్లా సమగ్ర శిక్షా, అలింకో సంస్థ సంయుక్తంగా ఈ కార్యక్రమం చేపడుతున్నాయి. ఇందులో భాగంగా దివ్యాంగ విద్యార్థుల కోసం ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నారు. నవంబర్ 24వ తేదీ నుంచి నవంబర్ 29వ తేదీ వరకూ నంద్యాలలో ఈ శిబిరాలు నిర్వహిస్తారు. డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 8వ తేదీ వరకూ కర్నూలు జిల్లాలో శిబిరాల నిర్వహణ ఉంటుంది. ఈ ప్రత్యేక శిబిరాల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు నిర్ధరణ పరీక్షలు నిర్వహిస్తారు. అయితే ఏ శిబిరాలను సంప్రదించాలనేది భవిత కేంద్రానికి వెళ్తే చెప్తారని అధికారులు తెలిపారు. ఇక ఈ ప్రత్యేక శిబిరాలకు వచ్చే విద్యార్థులకు, వారి సహాయకులకు రవాణా ఖర్చులు కూడా అందిస్తారు. అలాగే మధ్యాహ్న భోజనం ఖర్చులు కూడా చెల్లిస్తారు.


అయితే ప్రత్యేక శిబిరాలకు వచ్చే దివ్యాంగ విద్యార్థులు తమ వెంట ఏడీఐపీ ఫాం, సదరం సర్టిఫికేట్ జిరాక్స్, రేషన్ కార్డు, ఇన్‌కమ్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, పీహెచ్‌సీ డాక్టర్ సర్టిఫికేట్, పాస్ పోర్టు సైజ్ ఫోటోలు, యూనిక్ డిజబిలిటీ ఐడెంటిటీ కార్డు వెంట తెచ్చుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ ధ్రువపత్రాలను స్కాన్ చేసిన అనంతరం.. ప్రత్యేక శిబిరాల వద్ద ఏర్పాటు చేసిన వాట్సాప్ నంబరుకు పంపించాల్సి ఉంటుంది. అలాగే విద్యార్థి ఆధార్ కార్డుకు అనుసంధానమైన ఫోన్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఇందుకోసం ఆ మొబైల్ నంబర్ ఉన్న ఫోన్ వెంట తెచ్చుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa