ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యాషెస్‌ తొలి టెస్ట్‌కు ఇంగ్లాండ్ రెడీ.. ఆసీస్‌కు సవాల్ విసురుతూ తుది జట్టు ప్రకటన

sports |  Suryaa Desk  | Published : Wed, Nov 19, 2025, 09:24 PM

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న యాషెస్‌.. సిరీస్‌కు వేళైంది. నవంబర్ 21 నుంచి పెర్త్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఏ టెస్టు మ్యాచ్‌కైనా.. ఒకటి రెండు రోజులు ముందుగానే తుది జట్టును ప్రకటించే అలవాటు కొనసాగిస్తున్న ఇంగ్లాండ్.. ఈసారి కూడా అదే పని చేసింది. రెండు రోజుల ముందే పెర్త్ టెస్ట్‌ కోసం 12 మంది సభ్యులతో కూడిన తుది జట్టును ప్రకటించింది.


ఈ మ్యాచ్‌ కోసం 12 మంది సభ్యులతో కూడిన తుది జట్టును ఇంగ్లాండ్ బుధవారం అంటే నవంబర్ 19న రివీల్ చేసింది. అయితే ఈ జట్టులో ఆ జట్టు యువ సంచలనం, ఐపీఎల్‌లో ఆర్సీబీ ప్లేయర్ జాకబ్ బెథెల్‌కు చోటు దక్కలేదు. స్టార్ పేసర్‌ మార్క్‌ వుడ్‌ గాయం నుంచి పూర్తిగా కోలుకొని తుది జట్టులోకి వచ్చేశాడు. గత కొంతకాలంగా ఫామ్‌లో లేని ఓలీ పోప్‌ కూడా ఈ జట్టులో స్థానం సంపాదించాడు. పోప్‌ స్థానంలో బెథెల్‌కు ఛాన్స్ వస్తుందని అంతా భావించినా.. ఈసీబీ మాత్రం పోప్‌పైనే నమ్మకం ఉంచింది.


ఆఫ్ స్పిన్నర్‌ షోయబ్ బషీర్ సైతం ఈ జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే ప్లెయింగ్‌ లెవెన్‌ మాత్రం ఇంకా ఖరారు కాలేదు. పెర్త్ పిచ్‌ పేసర్లకు అనుకూలిస్తుందనే అంచనాలు ఉన్నాయి. దీంతో బషీర్.. బెంచ్‌కే పరిమితం కావొచ్చు. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్‌ నవంబర్‌ 21న ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది.


పెర్త్ టెస్ట్‌కు ఇంగ్లాండ్ 12 మంది సభ్యుల జట్టు ఇదే..


బెన్ స్టోక్స్ (కెప్టెన్‌), జోఫ్రా ఆర్చర్, గస్‌ అట్కిన్సన్, షోయబ్ బషీర్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్స్‌, జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, జేమీ స్మిత్ (వికెట్‌ కీపర్‌), మార్క్ వుడ్.


కాగా ఇటీవల యాషెస్‌లో ఆస్ట్రేలియా.. ఇంగ్లాండ్‌పై ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. 2015 నుంచి యాషెస్ సిరీస్‌లో ఇంగ్లాండ్ విజేతగా నిలవలేదు. మరీ ముఖ్యంగా 2 దశాబ్దాలుగా ఆస్ట్రేలియా గడ్డపై సిరీస్ గెలవలేదు. మరి ఈసారి ఇంగ్లాండ్ ఎలాంటి ప్రదర్శన చేస్తుందో.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa