దేశంలో దివ్యాంగులు తీవ్రమైన ఆరోగ్య బీమా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని, దాదాపు 80 శాతం మందికి ఎలాంటి ఆరోగ్య రక్షణ లేదని ఒక జాతీయ శ్వేతపత్రం వెల్లడించింది. బీమా కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో 53 శాతం మందిని కంపెనీలు తిరస్కరించాయని, తిరస్కరణకు గురైన వారిలో 60 శాతం మందికి అసలు కారణమే చెప్పడం లేదని ఈ నివేదిక స్పష్టం చేసింది.దేశవ్యాప్తంగా 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 5,000 మందికి పైగా దివ్యాంగుల నుంచి సేకరించిన వివరాలతో ‘నేషనల్ సెంటర్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ డిసేబుల్డ్ పీపుల్’ (ఎన్సీపీఈడీపీ) ఈ శ్వేతపత్రాన్ని గురువారం విడుదల చేసింది. చట్టపరమైన రక్షణలు, ప్రభుత్వ ఆదేశాలు ఉన్నప్పటికీ దాదాపు 16 కోట్ల మంది దివ్యాంగులు ఆర్థిక భద్రతకు దూరంగా ఉన్నారని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. కేవలం దివ్యాంగులన్న కారణంతోనే అనేక పాలసీలను తిరస్కరిస్తున్నట్లు ఆధారాలున్నాయని పేర్కొంది.ఆటిజం, మానసిక సమస్యలు, మేధోపరమైన వైకల్యాలు, థలసేమియా వంటి రక్త సంబంధిత రుగ్మతలు ఉన్నవారి దరఖాస్తులు ఎక్కువగా తిరస్కరణకు గురవుతున్నాయి. ఇక బీమా పొందేందుకు ప్రయత్నించేవారికి అందుబాటులో లేని డిజిటల్ ప్లాట్ఫారాలు, అధిక ప్రీమియంలు, పథకాలపై అవగాహన లేకపోవడం వంటివి అడ్డంకులుగా మారుతున్నాయి.ఈ సందర్భంగా ఎన్సీపీఈడీపీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అర్మాన్ అలీ మాట్లాడుతూ.. "దేశంలో 70 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లందరినీ ఆయుష్మాన్ భారత్ పరిధిలోకి తెస్తున్నారు. వారితో సమానంగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న దివ్యాంగులను ఎందుకు చేర్చలేకపోతున్నారు? ఆదాయ, వయోపరిమితులతో సంబంధం లేకుండా 21 రకాల దివ్యాంగులందరినీ ఈ పథకంలో చేర్చాలి" అని డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa