ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజల సమస్యలు తెలుసుకొనేందుకు కుప్పం వెళ్తున్నాను

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 22, 2025, 04:23 PM

ఏపీ సీఎం చంద్రబాబు భార్య, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి కుప్పం నియోజకవర్గంలో పర్యటించారు. శాంతిపురం, రామకుప్పం మండలాల్లో జరిగిన పలు కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. ఈ పర్యటనలో కొన్ని ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా, ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఆమె, ఆధార్ కార్డు అందుబాటులో లేకపోవడంతో డబ్బులు చెల్లించి టికెట్ తీసుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది.వివరాల్లోకి వెళితే, శాంతిపురం మండలం కడపల్లె నుంచి తుమ్మిశి చెరువు వరకు భువనేశ్వరి మహిళలతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఈ సందర్భంగా 'స్త్రీ శక్తి' పథకం అమలు గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. ఉచిత ప్రయాణానికి ఆధార్ కార్డు తప్పనిసరి కావడంతో, మహిళా కండక్టర్ ఆమెను ఆధార్ కార్డు చూపించమని కోరారు. తన వద్ద కార్డు లేదని, ఫోన్‌లో ఉన్నప్పటికీ దానిని ఇంటి వద్దే మర్చిపోయానని భువనేశ్వరి తెలిపారు. దీంతో కండక్టర్ నిబంధనల ప్రకారం టికెట్ తీసుకోవాలని సూచించగా, ఆమె వెంటనే అంగీకరించి డబ్బులు చెల్లించి టికెట్ కొనుగోలు చేశారు.అనంతరం నడింపల్లెలో జరిగిన సభలో భువనేశ్వరి మాట్లాడుతూ, తాను కుప్పం ఎందుకు వస్తున్నానో వివరించారు. రాష్ట్ర అభివృద్ధి పనులతో చంద్రబాబు తీరిక లేకుండా ఉన్నారని, అందుకే ఆయన బదులుగా ప్రతి మూడు నెలలకు ఒకసారి తాను వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకుంటానని చెప్పారు. తన ప్రసంగాన్ని తమిళంలో "ఎల్లారక్కుం సౌగ్యమా?" (అందరూ బాగున్నారా?) అంటూ ప్రారంభించి స్థానికులను ఆకట్టుకున్నారు. అంతకుముందు మహిళలతో కలిసి కోలాటం ఆడి వారిలో ఉత్సాహం నింపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa