ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో శుభవార్త. ఏపీలో పెట్టుబడుల ఆకర్షణకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ఫలితాలు ఇస్తున్నాయి. ఈ క్రమంలోనే పలు సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. తాజాగా సీకే బిర్లా గ్రూప్ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. సీకే బిర్లా గ్రూపు సంస్థ అయిన బిర్లాను (BirlaNu) ఏపీలో ఫైబర్ సిమెంట్ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. నెల్లూరు జిల్లాలో ఫైబర్ సిమెంట్ బోర్డు ప్లాంట్ నెలకొల్పనుంది. ఈ విషయాన్ని బిర్లాను ఎండీ అక్షత్ సేథ్ ఓ ప్రకటనలో వెల్లడించారు. దీర్ఘకాలిక ప్రణాళికల్లో భాగంగా ఏపీలో నూతన ఫైబర్ సిమెంట్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక వసతుల కారణంగా కొత్త ప్లాంట్ ఏర్పాటు కోసం ఏపీని ఎంచుకున్నట్లు వివరించారు.
మరోవైపు ఈ ప్రాజెక్టులో భాగంగా.. బిర్లాను సంస్థ నెల్లూరు ఫైబర్ సిమెంట్ ప్లాంట్ కోసం తొలి దశలో రూ.127 కోట్లు ఖర్చుచేయనుంది. ఈ ప్లాంట్ ఏర్పాటు ద్వారా 600 మందికి ఉద్యోగాలు లభిస్తాయని అంచనా. ఈ ఫైబర్ సిమెంట్ ప్లాంట్లో.. ఫ్లైయాష్ను ఉపయోగించి ఫైబర్ సిమెంట్ తయారు చేస్తారు. నెల్లూరులో ఏర్పాటు చేసే బిర్లాను ఫైబర్ సిమెంట్ ప్లాంట్లో అధునాతన సాంకేతికతను ఉపయోగించనున్నారు. ఈ ప్లాంట్ ద్వారా ప్రాంతీయ ఆర్థిక కార్యకలాపాలను వేగవంతం చేయాలని బిర్లాను సంస్థ భావిస్తోంది. బొగ్గు ఆధారిత థర్మల్ పవర్ ప్లాంట్ల నుంచి వచ్చే ఫ్లై యాష్ను ముడిసరుకుగా ఉపయోగించుకుని ఫైబర్ సిమెంట్ తయారు చేస్తారు. రెండో దశలో బిర్లాను సంస్థ పాలీ వినైల్ క్లోరైడ్ పైపులు, ఫిట్టింగ్లు, నిర్మాణ రంగంలో ఉపయోగించే రసాయనాలు తయారు చేయాలని భావిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa