తమిళనాడులో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. తెంకాశీ జిల్లాలో ఎదురెదురుగా వస్తున్న రెండు ట్రావెల్స్ బస్సులు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో కనీసం ఆరుగురు మృతి చెందగా.... మరో 35 మందికి గాయాలయ్యారు. క్షతగ్రాతులను చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. వీరిలో కొందరికి తీవ్రగాయాలు కావడంతో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ బస్సు మదురై నుంచి సెంకొట్టాయ్కు, ఇంకోటి తెన్కాశి నుంచి కోవిల్పట్టికి వెళ్తున్నాయి. ఈ క్రమంలో మదురై-సెంకొట్టాయ్ కైసర్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనం నడుపుతూ ఎదురుగా వస్తోన్న బస్సును ఢీకొట్టాడు. దీంతో రెండు వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి.
రెండు బస్సుల్లోని ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో 35 మంది గాయపడ్డారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కైసర్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ బాధ్యతారాహిత్యమే ఈ ప్రమాదం కారణమని ప్రాథమికంగా నిర్దారించినట్టు ఓ సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. అతడి అతివేగం, నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారని ఆయన చెప్పారు.
క్షతగాత్రులకు సమీపంలోని పలు ఆసుపత్రుల్లో చికిత్స కొనసాగుతుందని తెలిపారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని, దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వైద్యులు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్లు, ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలను రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం కోసం తరలించినట్టు పోలీసులు చెప్పారు. మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదు.
కాగా, ఇటీవల గత కొద్ది రోజుల నుంచి దేశంలో వరుస రోడ్డు ప్రమాదాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. రాజస్థాన్లో వరుసగా రెండు ప్రమాదాలు ఏపీలోని కర్నూలు వద్ద ప్రయివేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురికాగా.. 19 మంది, తెలంగాణలోని చెవెళ్ల వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa