ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో ధాన్యం రైతులకు.. గతేడాది కన్నా ఎక్కువ చెల్లింపు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 25, 2025, 08:05 PM

ఏపీలోని వరి రైతులకు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శుభవార్త వినిపించారు. రైతులు పండించిన ధాన్యానికి కనీస మద్దతు ధరను అందిస్తున్నట్లు తెలిపారు. గత సంవత్సరం కంటే 72 రూపాయలు అదనంగా ధాన్యం రైతులకు చెల్లిస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వివరించారు. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో మంత్రి నాదెండ్ల మనోహర్ మంగళవారం పర్యటించారు. కొన్ని రైతు సేవా కేంద్రాలను సందర్శించారు. రైతు సేవా కేంద్రాల వద్దకు ధాన్యం అమ్మేందుకు వచ్చిన రైతులతో మాట్లాడారు. ధాన్యంలో తేమ శాతాన్ని పరిశీలించారు.


అనంతరం మాట్లాడిన మంత్రి నాదెండ్ల మనోహర్.. రైతులు బాగుండాలని.. వారి ఆదాయం పెంచాలనే ఆలోచనతో తమ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. అందులో భాగంగా ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తోందని.. 24 గంటల్లోనే రైతుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ చేస్తు్న్నామన్నారు. రైతులకు ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో ఖరీఫ్ సీజన్‌లో ధాన్యం సేకరణ కోసం ఏపీ ప్రభుత్వం రూ.14 వేల కోట్లు సిద్ధం చేసిందని వివరించారు.


 మరోవైపు రైతులు సులభంగా ధాన్యం విక్రయాలు సాగించేందుకు ఏపీ ప్రభుత్వం వాట్సప్‌ సేవలను అందుబాటులోకి తెచ్చింది. 73373 59375 వాట్సాప్ నంబరుతో రైతుల కోసం ఈ సేవలు అందుబాటులోకి తెచ్చింది. ప్రభుత్వానికి ధాన్యం విక్రయించాలని నిర్ణయించుకున్న రైతులు 73373 59375 వాట్సప్‌ నంబర్‌కు హాయ్‌ అనే మెసేజ్‌ పంపించాల్సి ఉంటుంది. అలా పంపగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ప్రత్యేక వాయిస్‌తో సేవలు అందిస్తారు. వాయిస్ సూచనల మేరకు ‘రైతు తన ఆధార్‌ నంబరు నమోదు చేయాల్సి ఉంటుంది. అనంతరం తన పేరును ధ్రువీకరించాలి. ఆ తర్వాత ధాన్యం ఎప్పుడు అమ్ముతారనే విషయంపై మూడు ఆప్షన్లు వస్తాయి. రైతులు తమకు అనుకూలమైన తేదీని, సమయాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది.


తేదీ, సమయం ఎంచుకున్న తర్వాత ఏ రకం ధాన్యం అమ్ముతున్నామనే వివరాలను రైతులు నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎన్ని బస్తాలు అమ్ముతారనే వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది. ఇవన్నీ పూర్తయిన తర్వాత రైతులకు ఓ మెసేజ్‌ వస్తుంది. ధాన్యం అమ్మకం స్లాట్‌ బుక్‌ అయినట్లుగా రైతుల ఫోన్‌కు మెసేజ్ రూపంలో కూపన్‌ కోడ్‌ వస్తుంది. ఈ కూపన్ కోడ్ సాయంతో రైతు ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద సులభంగా ధాన్యం అమ్ముకునేలా ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.


మరోవైపు ఈ ఖరీఫ్ సీజన్‌లో 51 లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు అనుగుణంగా.. 4000 రైతు సేవాకేంద్రాలు.. 3000 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దకు ధాన్యాన్ని తరలించేందుకు అయ్యే రవాణా ఖర్చును కూడా ప్రభుత్వం రైతులకు చెల్లిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa