తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ప్రమాదం చోటుచేసుకుంది. ఓ టైల్స్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం సంభవించి ఇద్దరు చనిపోయారు. మరికొందరు కూలీలకు తీవ్రగాయాలయ్యాయి. శ్రీకాళహస్తి మండలం ఎల్లంపాడు సమీపంలోని ఓ టైల్స్ ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అయితే గ్యాస్ సిలిండర్ పేలడమే ప్రమాదానికి కారణంగా తెలిసింది. ఈ ప్రమాద ఘటనలో పాండు, పోతురాజు అనే ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరి కొంతమంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స కోసం వెంకటగిరి ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే శ్రీకాళహస్తి గ్రామీణ పోలీసులు అక్కడకు చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.
వృద్ధురాలి మెడలో గొలుసు చోరీ
మరోవైపు వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసు చోరీ చేసిన ఘటన సూళ్లూరుపేట గ్రామీణం పరిధిలో చోటుచేసుకుంది. సూళ్లూరుపేట విద్యుత్తు కార్యాలయం వద్ద ఈ ఘటన జరిగింది. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు మోటారు సైకిల్ మీద వచ్చి ఓ వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసును లాక్కె్ళ్లారు. చోరీ చేసిన గొలుసు మూడు సవర్లు ఉంటుందని బాధితురాలు చెప్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మంగళవారం సాయంత్రం మంగమ్మ అనే వృద్ధురాలు రోడ్డుపై నడిచి వెళ్తున్నారు. బాపూజీ కాలనీలోని కూతురి ఇంటి నుంచి బొగ్గుల వీధిలోని సొంత ఇంటికి వెళ్తున్నారు.
అయితే ఈ సమయంలోనే కరెంట్ ఆఫీసు వద్దకు రాగానే ఇద్దరు గుర్తుతెలియని దుండగులు బైక్ మీద వచ్చారు. మంగమ్మ మెడలోని బంగారు గొలుసును లాక్కొని వెళ్లారు. దీంతో బాధితురాలు లబోదిబోమంటూ స్థానిక పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ చుట్టుపక్కల సీసీ ఫుటేజీని పరిశీలించారు. ఈ సమయంలో నంబరు ప్లేట్ లేని ఓ ద్విచక్రవాహనం మీద వచ్చిన ఇద్దరు యువకులు వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసును చోరీ చేసినట్లు గుర్తించారు. ఇద్దరు దుండగులను గుర్తించేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa