ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే పండుగలలో జగ్గన్నతోట ప్రభల తీర్థానికి ప్రత్యేక స్థానం ఉంది. వందల ఏళ్లుగా తెలుగు సంస్కృతికి చిహ్నంగా ఈ పండుగ నిలుస్తోంది. అయితే జగ్గన్నతోట ప్రభల తీర్థాన్ని రాష్ట్ర పండుగగా గుర్తించేందుకు సీఎం చంద్రబాబు సమ్మతించారని పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఈ మేరకు మలికిపురం గ్రామానికి మంగళవారం (నవంబర్ 25) వచ్చిన ఆయనకు స్థానికులు వినతిపత్రం అందించారు.
స్థానికుల వినతిపై స్పందించిన మంత్రి దుర్గేష్.. లక్షల మంది భక్తుల కోలాహలం మధ్య ప్రతి సంవత్సరం వైభవంగా నిర్వహించే ఈ ప్రభల తీర్థానికి 450 సంవత్సరాల ఘనచరిత్ర ఉందని గుర్తుచేశారు. ఈ విషయంపై ఇప్పటికే ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్తో పాటు సృజనాత్మక, సాంస్కృతిక కమిషన్ ఛైర్పర్సన్ పొడపాటి తేజస్వి దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. దీనికి సీఎం చంద్రబాబు కూడా సమ్మతి తెలిపారన్నారు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం మొసలపల్లి గ్రామంలో ఏటా సంక్రాంతి పర్వదినాల్లో.. జగ్గన్నతోట ప్రభల తీర్థాన్ని నిర్వహిస్తారు. పంట కాలువల సవ్వడి నడుమ సంక్రాంతి కనుమ రోజున ఈ ఉత్సవం జరుగుతుంది. దాదాపు 450 ఏళ్లు చరిత్ర కలిగిన ఈ ఉత్సవాన్ని రాష్ట్ర పండుగగా గుర్తించాలని ప్రజలు ఎప్పటినుంచో ఆకాంక్షిస్తున్నారు. దేశం మొత్తంలో.. ఏకాదశరుద్రులు ఒకేచోట కొలువుతీరేది జగ్గన్నతోట ప్రభల ఉత్సవంలోనే. రాష్ట్రంలో అత్యంత ఎత్తయిన ప్రభలు అంబాజీపేట మండలంలోనే తయారు చేస్తారు.
ఈ జగ్గన్నతోట ప్రభల ఉత్సవం విశిష్టత గురించి గంగలకుర్రు అగ్రహారానికి చెందిన శివకేశవ యూత్ సభ్యులు రాసిన లేఖల ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ తెలుసుకున్నారు. అనంతరం ప్రధాని 2020లో తన సందేశాన్ని పంపించారు. 2023లో ఢిల్లీలో నిర్వహించిన గణతంత్ర వేడుకలో జగ్గన్నతోట ప్రభల తీర్థం శకటాన్ని ప్రదర్శించారు. ఈ ప్రభల గురించి ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించడం విశేషం. ఈ ఏడాది పర్యాటకశాఖ ఈవెంట్స్-ఫెస్టివల్ వెబ్సైట్లో ఈ ఉత్సవం చోటు దక్కించుకోవడం గమనార్హం. అంతేకాకుండా పదోతరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో.. జగ్గన్నతోట ప్రభల తీర్థం ప్రాధాన్యత, ప్రాచుర్యాన్ని వివరించారు.
జగ్గన్నతోట ప్రభల తీర్థాన్ని రాష్ట్రపండుగగా గుర్తిస్తే.. కోనసీమ ప్రాంతం ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. దేశవ్యాప్తంగా విశిష్ట గుర్తింపు దక్కుతుంది. పర్యాటకులు కూడా ఎక్కువ సంఖ్యలో రావడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఇక రాష్ట్ర పండుగగా గుర్తిస్తే.. ఈ ఉత్సవం మరింత వైభవంగా జరపడానికి.. ఉత్సవానికి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తారు. అంతేకాకుండా పదకొండు గ్రామాల్లో కొలువుదీరిన ఏకాదశ రుద్రుల ఆలయాలు మరింత అభివృద్ధి చెందుతాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు.. ఆలయాల వద్ద ప్రధానంగా తాగునీరు, వైద్యశిబిరాలు, పారిశుద్ధ్యం వంటి సౌకర్యాలు ఏర్పాటు చేయొచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa