పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. రావల్పిండి జైలులో బందీగా ఉన్న ఆయనను గత నాలుగు వారాలుగా కుటుంబ సభ్యులను కలవనివ్వకపోవడంతో ఆయన సోదరి నొరీన్ నియాజీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. జైలు అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో తమ సోదరుడి పరిస్థితి ఏమిటో తెలియడం లేదని ఆమె ఆవేదన పడ్డారు. ఇమ్రాన్ ఖాన్ను చంపేశారనే రూమర్లు సైతం సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్నాయి.
“నా సోదరుడు బ్రతికే ఉన్నాడో లేడో కూడా తెలియట్లేదు. జైలు అధికారులు మాకు ఎటువంటి సమాచారం అందించడం లేదు” అంటూ నొరీన్ నియాజీ గుండెలు బాదుకున్నారు. ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి గురించి రోజురోజుకూ ఆందోళన పెరుగుతోందని, ఆయనకు ఏమైనా అయితే దేశవ్యాప్తంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కొనాల్సి వస్తుందని ఆమె హెచ్చరించారు. కుటుంబ సభ్యులతో పాటు పీటీఐ నేతలు కూడా ఇమ్రాన్ భద్రత పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇమ్రాన్ ఖాన్కు మద్దతుగా ఖైబర్ పఖ్తుంఖ్వా ముఖ్యమంత్రి అలీ అమీన్ గండాపూర్ రావల్పిండి జైలు ముందు ధర్నాకు దిగారు. జైలు గేటు ముందు కూర్చొని నిరసన తెలిపిన ఆయన, ఇమ్రాన్ ఖాన్ను వెంటనే కలవనివ్వాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన పాకిస్తాన్ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పీటీఐ కార్యకర్తలు దేశవ్యాప్తంగా నిరసనలు నిర్వహిస్తున్నారు.
పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ అరెస్టు తర్వాత రాజకీయ అస్థిరత మరింత తీవ్రమైంది. ఆయనపై వేలాడుతున్న కేసులు, జైలు జీవితం, ఇప్పుడు కుటుంబ సభ్యులను కలవనివ్వకపోవడం.. ఇవన్నీ ఆయన అనుచరుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తున్నాయి. ఇమ్రాన్ ఖాన్ భద్రత దేశ రాజకీయ భవిష్యత్తుకు కీలకమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ పరిణామాలు రానున్న రోజుల్లో పాకిస్తాన్ను మరింత ఉద్ఘాతంలోకి నెట్టే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa