ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డ్వాక్రా మహిళలకు కొత్త బాధ్యతలు.. కాంట్రాక్టర్ల స్థానంలో

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 30, 2025, 07:09 PM

మహిళా సాధికారతే ధ్యేయంగా.. మహిళల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలు , డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసింది. ఈ డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలకు తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తూ.. ఆర్థిక అవసరాలను తీరుస్తోంది. అలాగే వారికి స్వయం ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తోంది. తాజాగా ఏపీ ప్రభుత్వం మరో వినూత్న ఆలోచన చేస్తోంది. డ్వాక్రా మహిళలకు మరిన్ని బాధ్యతలు అప్పగించటంతో పాటుగా వారికి మరిన్ని అవకాశాలు కల్పించాలని నిర్ణయించింది. ఈ ఆలోచన ఇప్పటికే కార్యరూపం దాల్చి పైలెట్ ప్రాజెక్టు కూడా అమలవుతోంది. త్వరలోనే ఈ విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలనే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది.ఇక అసలు విషయంలోకి వస్తే..


ప్రభుత్వ ఆధ్వర్యంలో అనేక విద్యా సంస్థలు నడుస్తుంటాయనే సంగతి తెలిసిందే. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు, వసతి గృహాలు, రెసిడెన్షియల్ స్కూల్స్, హాస్టల్స్ అంటూ రకరకాలు. వీటితో పాటుగా అంగన్వాడీలను సైతం ప్రభుత్వం నిర్వహిస్తూ వస్తోంది. ఈ కేంద్రాల ద్వారా విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు, హాస్టళ్లలో విద్యార్థులతో పాటుగా అంగన్వాడీలలో చిన్నారులకు, గర్భిణులు, బాలింత మహిళలకు పోషకాహారం అందిస్తున్నారు. అయితే వీటికి కావాల్సిన కూరగాయలు, ఆకుకూరలను కాంట్రాక్టర్లు అందిస్తుంటారు. ఆ తర్వాత ప్రభుత్వం వారికి బిల్లులు చెల్లిస్తూ వస్తోంది. అయితే ఈ విధానంలో డ్వాక్రా మహిళల భాగస్వామ్యం తీసుకురావాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.


 జిల్లాలోని డ్వాక్రా మహిళల సహకారంతో.. కూరగాయల సాగు చేపట్టి.. పంట ఉత్పత్తులను ప్రభుత్వ విద్యాసంస్థలకు సరఫరా చేయించాలనేదే ప్రణాళిక. మొత్తంగా చెప్పాలంటే కాంట్రాక్టర్ల పాత్రను ఇకపై డ్వాక్రా మహిళలు పోషించాల్సి ఉంటుందన్న మాట. విజయనగరం జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు కింద ఈ విధానం ఇప్పటికే ప్రారంభమైంది. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఈ విధానం అమలు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ విధానం అమల్లోకి వస్తే వచ్చే రోజుల్లో డీఆర్‌డీఏ పర్యవేక్షణలో.. డ్వాక్రా మహిళా సంఘాలు.. కూరగాయలు సాగు చేసి వాటిని ప్రభుత్వ సంస్థలకు విక్రయించనున్నాయి.


మరోవైపు విజయనగరం జిల్లాలో 27 రైతు ఉత్పత్తిదారుల సంస్థలు.. ఇప్పటికే ఈ విధానం కింద పనిచేస్తున్నాయి. ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ కింద 32,100 ఫార్మర్ ప్రొడ్సూర్ గ్రూప్స్ ఉన్నాయి. ఈ గ్రూపులకు అధికారులు కూరగాయల సాగుపై మెలకువలు నేర్పించారు. అది కూడా సేంద్రీయ సాగు పద్ధతులను ప్రోత్సహిస్తున్నారు. వీటి ద్వారా డ్వాక్రా మహిళా సంఘాలకు ఎక్కువ ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయని అధికారులు చెప్తున్నారు.


మహిళా సంఘాలు వివిధ పంటలను ఉత్పత్తి చేసి రైతు ఉత్పత్తిదారుల సంస్థలకు సరఫరా చేస్తాయి, తరువాత వాటిని విద్యా సంస్థలకు పంపిణీ చేస్తారు. ఇందుకోసం అధికారులు గోడౌన్లు కూడా ఏర్పాటు చేయనున్నారు. విజయనగరం, తెర్లాం. దత్తిరాజేరులలో గోడౌన్లు ఉన్నాయి. మరి కొన్ని ప్రాంతాలలో భూసేకరణ చేపట్టారు. మరోవైపు ఈ విధానాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం గోడౌన్ల నిర్మాణంపా రాయితీలు, మహిళా సంఘాలకు బ్యాంకు రుణాలు అందిస్తోందని వివరిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa