కేంద్ర ప్రభుత్వాలు మొదలుకొని.. రాష్ట్ర ప్రభుత్వాల వరకూ సంక్షేమ పథకాల ఏవైనా సరే.. రేషన్ కార్డు అనేది ప్రామాణికంగా మారిపోయింది. పేద కుటుంబాలకు ప్రభుత్వాలు వీటిని జారీ చేస్తుంటాయి. బియ్యం కార్డుల ఆధారంగా ఆ కుటుంబం ఆదాయాన్ని అంచనా వేసి.. వారికి ప్రభుత్వ పథకాల లబ్ధిని, ప్రయోజనాలను అందిస్తూ ఉంటారు. అయితే కొత్త రేషన్ కార్డులు పొందాలంటే అదో ప్రహసనం. ఏళ్లకు ఏళ్లు గడిస్తే కానీ కొత్త రేషన్ కార్డుల కోసం ప్రభుత్వాలు దరఖాస్తులు స్వీకరించేవి కావు.
అలాగే కొత్తగా పెళ్లైన జంటలకు కొత్త బియ్యం కార్డు కావాలన్నా, పిల్లలను బియ్యం కార్డులలో చేర్చాలన్నా కూడా అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితులు ఉండేవి. అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. రేషన్ కార్డుల జారీని నిరంతర ప్రక్రియ చేసింది ఏపీ ప్రభుత్వం. కొత్త రేషన్ కార్డుల కోసం ఎప్పుడైనా దరఖాస్తు చేసుకునేలా ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో కొత్త వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల ప్రక్రియను డిజిటల్ సహాయకులకు అప్పగించారు.
ఇక కొత్తగా పెళ్లైన జంటలు.. రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలంటే.. గతంలో చాలా పెద్ద తతంగం ఉండేది. కానీ ఇప్పుడా బాధ తప్పింది. భార్యాభర్తల ఆధార్ కార్డు వివరాలుతో పాటుగా భర్త పాత రేషన్ కార్డు, వివాహ ధ్రువీకరణ పత్రం ఉంటే సరిపోతుంది. ఈ పత్రాలను తీసుకుని సమీపంలోని సచివాలయానికి వెళ్తే అక్కడ ఉండే డిజిటల్ సహాయకులు వెబ్సైట్లో మ్యారేజీ స్ల్పిట్ ఆప్షన్ కింద నమోదు చేస్తారు. అనంతరం వారికి ఓ నంబరు కేటాయిస్తారు. ఆ నంబర్ ఆధారంగా ఈకేవైసీ ప్రక్రియ చేపడతారు. ఆ తర్వాత అక్కడి నుంచి స్థానిక వీఆర్వో, తహసీల్దారు పరిశీలన కోసం దరఖాస్తు పంపుతారు. అక్కడి నుంచి అనుమతి రాగానే.. దరఖాస్తుదారులకు కొత్త రేషన్ కార్డు మంజూరు చేస్తారు.
మరోవైపు రేషన్ కార్డులో కొత్తగా పిల్లల పేర్లు నమోదు చేయడం కూడా ఇప్పుడు చాలా సులభం. ఎవరినైతే రేషన్ కార్డులో చేర్చాలని అనుకుంటున్నారో ఆ పిల్లల ఆధార్ కార్డుతో పాటుగా, పుట్టినరోజు ధ్రువపత్రం, తల్లిదండ్రుల రేషన్ కార్డు వివరాలు ఉంటే సరిపోతుంది. ఈ వివరాలతో సచివాలయంలోని డిజిటల్ సహాయకులను సంప్రదిస్తే.. వారు వివరాలు నమోదు చేసి.. స్థానిక వీఆర్వో, తహసీల్దారు వద్దకు పంపుతారు. వారి నుంచి అనుమతి రాగానే రేషన్ కార్డులో కొత్త పేర్లు చేరుస్తారు.
అలాగే రేషన్ కార్డులలో అడ్రస్ మార్పునకు కూడా అవకాశం కల్పించారు. ఇంకా ఏవైనా సందేహాలు ఉంటే సచివాలయాల్లో సంప్రదించాలని అధికారులు సూచించారు. అలాగే జనవరి - జూన్ మధ్యన రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే.. వారికి జులై నెలలో కొత్త బియ్యంకార్డులు అందిస్తారు. అలాగే జులై నుంచి డిసెంబర్ వరకూ దరఖాస్తు చేసుకున్న వారికి జనవరి నెలలో కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa