పాకిస్తాన్ పౌరులు, నేతలు, ఆర్మీ చీఫ్ చివరికి ప్రధానమంత్రి చేసే పనులు అప్పుడప్పుడూ చాలా ఫన్నీగా ఉంటాయి. ఏదో చేయాలనే తపనతో చేసే పనులు కాస్తా కామెడీగా మారి నవ్వుల పాలు అవుతూ ఉంటారు. తాజాగా ఏకంగా పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో జరిగిన ఓ సంఘటన.. అక్కడి ఎంపీల పరువు మొత్తం పోయేలా చేసింది. పార్లమెంటు ఆవరణలో దొరికిన డబ్బులు తమవే అంటూ పలువురు ఎంపీలు ఎగబడటం.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో.. పాకిస్తాన్ ఎంపీలపై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక పాకిస్తాన్ పౌరులు కూడా.. తమ ఎంపీలు దేశ పరువును తీసేశారని మండిపడుతున్నారు.
ప్రస్తుతం ఇస్లామాబాద్లో పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా.. సోమవారం ఒక హాస్యాస్పద సంఘటన చోటు చేసుకుంది. స్పీకర్ అయాజ్ సాదిక్కు సభలో 5 వేల పాకిస్తాన్ రూపాయల కరెన్సీ నోట్లు 10 (మొత్తం 50 వేల పాకిస్తాన్ రూపాయలు) దొరికాయి. అంటే ఇది మన దేశ కరెన్సీలో కేవలం రూ. 16,500. తనకు దొరికిన 10 నోట్లను తన చేతిలో పట్టుకుని.. అవి ఎవరివి అంటూ స్పీకర్ అయాజ్ సాదిక్.. అక్కడ ఉన్న ఎంపీలను అడిగారు. అయితే వెంటనే 10-15 మంది ఎంపీలు వెంటనే చేతులు పైకి ఎత్తి.. అవి తమ డబ్బులే అంటూ చెప్పారు.
అది చూసిన స్పీకర్ అయాజ్ సాదిక్ షాక్ అయ్యారు. వెంటనే ఇక్కడ 10 నోట్లే ఉన్నాయి కానీ వాటికి 12 మంది యజమానులు ఉన్నారంటూ.. చమత్కరించారు. ఈ ఘటనతో పాక్ నేషనల్ అసెంబ్లీలో ఒక్కసారిగా సభలో ఎంపీలు అంతా ఘొల్లున నవ్వారు. దీంతో కొద్దిసేపు సభా కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. నెటిజన్లు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు.
నెటిజన్ల విమర్శలు
అత్యధిక జీతాలు, అన్ని సౌకర్యాలు పొందుతున్న ఎంపీలు.. ఇలాంటి చిన్న మొత్తానికి అబద్ధాలు చెప్పడంపై పాకిస్తాన్ ప్రజలు, విమర్శకులు తీవ్రంగా మండిపడుతున్నారు. అయితే ఆ డబ్బులు ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ)కి చెందిన ఎంపీ అయిన ముహమ్మద్ ఇక్బాల్ అఫ్రిదికి చెందినవని తేలడంతో.. పాక్ అసెంబ్లీ కార్యాలయం ఆయనకు తర్వాత వాటిని అందించింది.
సోషల్ మీడియాలో విమర్శలు
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. పాకిస్తాన్ ప్రజలు తమ చట్టసభ సభ్యుల నైతిక ప్రమాణాలపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. లక్షల కొద్ది జీతాలు, ప్రభుత్వం నుంచి అన్ని రకాల సౌకర్యాలు తీసుకుంటున్నప్పటికీ.. వారి పరిస్థితి మాత్రం ఇదే అంటూ నెటిజన్లు విమర్శించారు. ఇది పార్లమెంటు సమయమని.. 5 వేల నోట్లకు 12 మంది ఎంపీలు తమవే అంనంటూ చేతులెత్తారని.. ఇదే వారి నైతిక ప్రమాణాలు అంటూ మరో నెటిజన్ తెలిపారు. అబద్ధాలు చెప్పి డబ్బులను తీసుకునేందుకు ప్రయత్నించిన ఎంపీలను.. పార్లమెంట్ ధిక్కారం కింద పరిగణించి.. వారిని పదవుల నుంచి తొలగించాలని విమర్శకులు డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa