ట్రెండింగ్
Epaper    English    தமிழ்

1000 మంది వంటవాళ్లు.. 30 వేల మంది అతిథులు,,,,ఎమ్మెల్యే కొడుకు పెళ్లి విందు

national |  Suryaa Desk  | Published : Wed, Dec 24, 2025, 08:54 PM

సాధారణంగా సినీ, రాజకీయ ప్రముఖుల ఇళ్లలో వివాహ వేడుకలు ఎంత ఆడంబరంగా జరుగుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొన్ని రోజుల క్రితం ప్రముఖ వ్యాపారవేత్త, తెలుగు మూలాలు ఉన్న ఎన్ఆర్‌ఐ రాజ్ మంతెన కుమార్తె వివాహం అంతర్జాతీయంగా వార్తల్లో నిలిచింది. ఉదయ్‌పూర్ వేదికగా జరిగిన ఈ వివాహ వేడుకకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు సైతం తరలి రావడం ఆసక్తికరంగా మారింది. ఇక భారతీయ కుబేరుడు ముకేష్ అంబానీ ఇంటి పెళ్లి వేడుకలు ఎంత ఘనంగా జరిగాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ క్రమంలో తాజాగా ఓ ఎమ్మెల్యే తన కుమారుడి వివాహ విందు కోసం చేసిన ఏర్పాట్లు వార్తల్లో నిలిచాయి. ఈ వేడుకకు 30 వేల మంది హాజరు కాగా.. వెయ్యి మంది వంటవాళ్లు పనిచేశారు.


మధ్యప్రదేశ్‌, సాంచీ ఎమ్మెల్యే ప్రభు రామ్‌ చౌధరీ తన కుమారుడి పెళ్లి విందు కోసం చేసిన ఏర్పాట్లు వార్తల్లో నిలిచాయి. ప్రభు రామ్ చౌదరీ.. పెద్ద కుమారుడు పర్వ్‌ చౌధరీ వివాహ విందుకు దాదాపు 30 వేల మంది హాజరయ్యారు. దీనికోసం ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లు పనిచేశారు. రాయ్‌సెన్‌లో 8 ఎకరాల్లో విందు వేదికను ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు కేంద్రమంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, శివరాజ్‌ సింగ్‌ చౌహాన్, మధ్యప్రదేశ్‌ ఉపముఖ్యమంత్రి జగదీశ్‌ దేవా వంటి నేతలు హాజరయ్యారు. వీరితో పాటు వివిధ రంగాలకు చెందిన సుమారు 30 వేల మంది అతిథులు ఈ విందులో పాల్గొన్నారు.


ఈ వేడుకకు హాజరైన అతిథులకు దేశ, విదేశ వంటకాలతో అద్భుతమైన విందు వడ్డించడం మాత్రమే కాక.. రాజస్థాన్‌ కళాకారులు సంప్రదాయ సంగీతాన్ని అందించారు. అయితే ఈ ఎమ్మెల్యే ఏర్పాటు చేసిన విందు.. ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌ చిన్న కుమారుడు డాక్టర్‌ అభిమన్యు, డాక్టర్‌ ఇషితా పటేల్‌ల వివాహం జరిగిన తీరుకు పూర్తి భిన్నంగా ఉండటం చర్చనీయాంశమైంది. అభిమన్యు వివాహం ఎలాంటి ఆర్భాటాలు లేకుండా.. మరో 21 జంటలతో కలిసి సామూహిక వివాహ వేడుకలో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.


పర్వ్‌ చౌధరీ వివాహ విందు కోసం రాయ్‌సెన్‌లో ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో ప్రత్యేక వేదికను సిద్ధం చేశారు. ఈ విందులో ప్రత్యేక ఆకర్షణగా వెయ్యిమంది వంటవాళ్లు దేశ, విదేశ వంటకాలను సిద్ధం చేశారు. రాజస్థాన్‌ నుంచి వచ్చిన కళాకారులు తమ సంప్రదాయ సంగీతంతో అతిథులను అలరించారు. రాయ్‌సెన్‌లో ఇంత పెద్ద వేడుక ఎప్పుడూ జరగలేదని స్థానికులు చెబుతున్నారు. ఈ వేడుకకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.


నిజానికి పర్వ్‌ చౌధరీ వివాహం భోపాల్‌లో చాలా నిరాడంబరంగా జరిగింది. అయితే, రిసెప్షన్‌ కోసం మాత్రం 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక పెద్ద టెంట్‌ను వేశారు. వేదిక చుట్టూ పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆ మైదానం ఒక చిన్న టౌన్‌షిప్‌లా కనిపించింది. ఈ విందు కోసం ఎంత ఖర్చు చేశారనేది ఇంకా తెలియాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa