బంగ్లాదేశ్లో అరాచక శక్తులు రెచ్చిపోతున్నాయి. రాజకీయ అస్థిరతకు తోడు.. ఇప్పుడు కళలు, సంస్కృతులపై కూడా దాడులు మొదలయ్యాయి. బాలీవుడ్ చిత్రం 'గ్యాంగ్స్టర్'లోని 'భీగీ భీగీ' పాటతో అంతర్జాతీయ గుర్తింపు పొందిన ప్రముఖ బంగ్లా గాయకుడు జేమ్స్ (ఫారూక్ మహ్మద్ సజ్జాద్ ఉద్దీన్) కచేరీపై జరిగిన రాళ్ల దాడి ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. మత ఛాందసవాద శక్తుల ఒత్తిడితో బంగ్లాదేశ్లో సంగీత ప్రియులు క్తసిక్తమవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
కచేరీలో ఏం జరిగిందంటే?
ఫరీద్పూర్ జిల్లా స్కూల్ 185వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం రాత్రి ఏర్పాటు చేసిన ఈ కచేరీకి వేల సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. జేమ్స్ వేదికపై పాడుతుండగా.. ఒక్కసారిగా బయటి వ్యక్తులు స్టేజీపైకి ఇటుకలు, రాళ్లను విసిరారు. ఈ ఆకస్మిక దాడిలో సుమారు 15 నుంచి 20 మందికి పైగా గాయపడ్డారు. పరిస్థితి అదుపు తప్పడంతో స్థానిక యంత్రాంగం కచేరీని తక్షణమే రద్దు చేసింది. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించింది. దీని వెనుక ఉగ్రవాద లేదా తీవ్రవాద ముఠాల హస్తం ఉందని కూడా నిర్వాహకులు ఆరోపిస్తున్నారు.
గత కొద్ది వారాలుగా బంగ్లాదేశ్లో కళాకారుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. తీవ్రవాద సమూహాల బెదిరింపుల కారణంగా పలువురు గాయకులు తమ ప్రదర్శనలను రద్దు చేసుకుంటున్నారు. తాజాగా దిగ్గజ గాయకుడు ఉస్తాద్ రషీద్ అలీ ఖాన్ కుమారుడు అర్మాన్ ఖాన్.. బంగ్లాదేశ్లో జరగాల్సిన తన అన్ని షోలను రద్దు చేసుకున్నారు. భవిష్యత్తులో తాను అక్కడ ప్రదర్శనలు ఇవ్వబోనని సంచలన ప్రకటన చేశారు. సరోద్ విద్వాంసుడు అలీ అక్బర్ ఖాన్ మనవడు సిరాజ్ అలీ ఖాన్.. ఢాకా వెళ్లినప్పటికీ భద్రతా కారణాలతో ప్రదర్శన ఇవ్వకుండానే భారత్కు తిరిగి వచ్చారు.
ఒకప్పుడు కళలకు నిలయంగా ఉన్న బంగ్లాదేశ్.. ఇప్పుడు ప్రదర్శనలు ఇచ్చేందుకు ఏమాత్రం సురక్షితం కాదని భారతీయ కళాకారులు బహిరంగంగానే అభిప్రాయపడుతున్నారు. జేమ్స్ లాంటి ఐకానిక్ సింగర్కే రక్షణ లేకపోతే.. సామాన్య కళాకారుల పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనిపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నామని చెబుతున్నా.. నేరస్థులను పట్టుకోవడంలో జాప్యం జరుగుతోందని విమర్శలు వస్తున్నాయి. బంగ్లాదేశ్లో పెరుగుతున్న ఈ ఉన్మాద ధోరణిని భారత ప్రభుత్వం ఇప్పటికే తీవ్రంగా పరిగణించింది. మైనారిటీలు, కళాకారులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని యూనస్ ప్రభుత్వానికి హెచ్చరికలు కూడా జారీ చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa