ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజధాని రైతు మరణాన్ని డైవర్షన్ చెయ్యడానికే చంద్రబాబు కొత్త డ్రామాకు తెరతీశారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Dec 28, 2025, 12:29 PM

వైయస్.జగన్ కు వస్తున్న జనాదరణ చూసి సీఎం చంద్రబాబు తట్టుకోలేక దిక్కుతోచని స్ధితిలో.. వైయ‌స్ఆర్‌సీపీపై దుష్ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... ఒకవైపు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గళమెత్తడంతో పాటు, మరోవైపు వైయస్.జగన్ పుట్టిన రోజును వాడ, వాడలా పండగలా నిర్వహించడంతో కూటమి ప్రభుత్వం తట్టుకోలేకపోతుందని స్పష్టం చేశారు. దీనికి తోడు అమరావతి కోసం ఇచ్చిన భూమికి బదులు వాగుల్లో ప్లాట్ కేటాయించారన్న ఆవేదనలో రాజధాని రైతు చనిపోవడంతో.. వీటన్నింటినీ డైవర్షన్ చేయడం కోసమే చంద్రబాబు కొత్త డ్రామాకు తెరతీశారని మండిపడ్డారు. వైయస్.జగన్ పుట్టిన రోజు సంబరాల్లో జంతుబలి అంటూ నానా గొడవ చేస్తున్న హోంమంత్రి అనిత... గతంలో చంద్రబాబు, బాలకృష్ణ ప్లెక్సీలకు పొట్టేళ్లను బలిఇచ్చి తలకాయలతో దండలు వేసిన ఘటనపై ఏం సమాధానం చెప్తారని నిలదీశారు.  తన నియోజకవర్గంలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటును గతంలో వ్యతిరేకించిన హోంమంత్రి.. ఇప్పుడు  ఉద్యమ నేత అప్పలరాజుని ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించిన ఆయన... ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే పీడీ యాక్ట్ బనాయిస్తారా? అని నిలదీశారు. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో పోలీసులు అధికార పార్టీకి కార్యకర్తల్లా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఆక్షేపించిన కన్నబాబు.. పోలీసులు చట్టపరిధిలో పనిచేయాలని, రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa