ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎవర్నీ కించపరచలేదని.. భారత ప్రభుత్వానికి సారీ చెప్పిన లలిత్ మోదీ

national |  Suryaa Desk  | Published : Mon, Dec 29, 2025, 08:49 PM

భారత ప్రభుత్వాన్ని ఎగతాళి చేస్తూ విజయ్ మాల్యాతో చేసిన వీడియోపై లలిత్‌ మోదీ క్షమాపణలు చెప్పారు. ‘మేము పరారీలో ఉన్న అతిపెద్ద ఎగవేతదారులం’ అంటూ వ్యంగ్యంగా ఓ వీడియోను సోషల్‌ మీడియాలో లలిత్ మోదీ పోస్ట్ చేయడంతో వైరల్‌ అయిన విషయం తెలిసిందే. దీంతో లలిత్‌ మోదీ, విజయ్‌ మాల్యాలపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకులను నిండా ముంచేసి పారిపోవడమే కాకుండా.. భారత్‌ను ఎగతాళి చేస్తున్నారని మండిపడ్డారు. తాజాగా, ఈ వివాదంపై స్పందించిన లలిత్‌ మోదీ.. ఉద్దేశపూర్వకంగా తాను ఈ వ్యాఖ్యలు చేయలేదని వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని.. భారత ప్రభుత్వం అంటే తనకు ఎంతో గౌరవం ఉందని అన్నారు.


‘‘నేను ఎవరి మనోభావాలనైనా కించపరిస్తే నన్ను క్షమించండి.. ముఖ్యంగా భారత ప్రభుత్వం పట్ల నాకు అత్యంత గౌరవం ఉంది. ఆ ప్రకటనను తప్పుగా అర్థం చేసుకున్నారు.. ఉద్దేశపూర్వకంగా నేను ఈ వ్యాఖ్యలు చేయలేదు.. మరోసారి నా హృదయపూర్వక క్షమాపణలు’’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. తర్వాత తాను పెట్టిన వీడియోను కూడా లలిత్ మోదీ డిలీట్ చేశారు.


గతవారం లండన్‌లో జరిగిన విజయ్ మాల్యా పుట్టిన రోజు వేడుకలకు లలిత్ మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగానే మాల్యాతో కలిసి మోదీ వీడియోను చేసి.. ‘మేము అతిపెద్ద పలాయనవాదులం.... మళ్లీ ఇంటర్నెట్‌ను షేక్ చేయడానికి నేను ఏదైనా చేస్తాను. ఇది మీకోసం... అసూయతో మీ గుండెలు మండిపోనివ్వండి’ అని పరోక్షంగా భారత ప్రభుత్వాన్ని సవాల్ చేశారు. మోదీ, మాల్యాలు పక్కపక్కనే నిలబడి‘భారత్‌కు చెందిన మేము ఇద్దరం పరారీలో ఉన్న అతిపెద్ద నేరస్థులం’ అని చెప్పడం స్పష్టంగా అందులో వినిపిస్తోంది.


ఈ వీడియోపై కేంద్ర ప్రభుత్వం కూడా తీవ్రంగానే స్పందించింది. ఎవ్వర్నీ వదిలిపెట్టబోమని, ఎక్కడ ఉన్న రప్పించి భారత చట్టాలకు అనుగుణంగా శిక్షిస్తామని హెచ్చరించింది. ‘దేశ చట్టాల నుంచి తప్పించుకుని, భారత్ నుంచి పారిపోయిన అందర్నీ వెనక్కి రప్పించే విషయంలో మేము పూర్తిగా కట్టుబడి ఉన్నాం... దీనిపై అనేక దేశాల ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నాం.. దీనికి సంబంధించిన ప్రక్రియలు ప్రస్తుతం కొసాగుతున్నాయి. ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసుల్లో అనేక చట్టపరమైన అంశాలు ఉన్నాయి.. అయినా వారిని ఇక్కడ న్యాయస్థానాల ముందు హాజరుపరచడానికి , వారిని తిరిగి రప్పించేందుకు కట్టుబడి ఉన్నాం’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ గతవారం మీడియాలో అడిగిన ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa