ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీచర్లకు వీధి కుక్కల లెక్కింపు బాధ్యతలు .. ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయంపై తీవ్ర విమర్శలు

national |  Suryaa Desk  | Published : Mon, Dec 29, 2025, 09:02 PM

దేశ రాజధానిలోని వీధి కుక్కలను లెక్కింపునకు ఉపాధ్యాయులను వినియోగించాలని ఢిల్లీ ప్రభుత్వం జారీచేసిన ఆదేశాలు చర్చనీయాంశంగా మారాయి. వీధి కుక్కల లెక్కింపు కోసం ప్రభుత్వ ఉపాధ్యాయులను నోడల్ ఆఫీసర్లుగా నియమించాలని అన్ని జిల్లాల విద్యా అధికారులకు విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఉత్తర్వులు ప్రకారం.. ఈ ప్రకియకోసం గుర్తించిన ఉపాధ్యాయుల పేర్లు, వివరాలను పంపాలని, దీనిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆఫీసుకు పంపుతామని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు సూచనలతో ప్రజా భద్రత కోసం ఈ చర్యలు తీసుకున్నట్టు అందులో స్పష్టం చేశారు.


ఈ విషయం ‘ప్రజల భద్రత"కు సంబంధించింది.. ముఖ్యంగా నవంబర్ 7 నాటి సుప్రీంకోర్టు ఉత్తర్వుల ఆదేశాలను, నవంబర్ 20న జరిగిన సమావేశంలో ఇచ్చిన సూచనలను పాటించడం వంటి అంశాలకు సంబంధించింది’ అని విద్యాశాఖ డైరెక్టర్ తన ఉత్తర్వులో పేర్కొన్నారు. అంతేకాదు, ఈ ప్రక్రియను ‘అత్యంత ప్రాధాన్యత’గా పరిగణించాలని కూడా తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉపాధ్యాయులు ఇందులో భాగస్వాములవుతారని ఓ అధికారి తెలిపారు.


వీధి కుక్కలను లెక్కించే ప్రక్రియ కోసం వాయువ్య జిల్లా నుంచి కనీసం 118 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులను గుర్తించినట్లు తెలిసింది. ముఖ్యమంత్రి రేఖా గుప్తా నియోజకవర్గ పరిధిలోకి వచ్చే షాలిమార్ బాగ్‌లోని ప్రభుత్వ ఉపాధ్యాయురాలు రీతు షైనీ మాట్లాడుతూ.. గత వారం ఉపాధ్యాయులకు దీని గురించి సమాచారం అందించినట్లు చెప్పారు. ‘ఈ పని గురించి మాకు గతవారం సమాచారం ఇచ్చారు.. ప్రభుత్వ ఆదేశాలు కాబట్టి మాకు వేరే ప్రత్యామ్నాయం లేదు’ అని ఆమె అన్నారు. ఉపాధ్యాయుల జాబితా సిద్ధమైందని, కుక్కల లెక్కింపు ఇంకా మొదలుపెట్టలేదని ఆమె చెప్పారు.


కాగా, ఈ ఉత్తర్వులపై ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విద్యాశాఖ మంత్రికి లేఖ రాసినట్టు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల సంఘం సభ్యుడు కృష్ణ ఫోగట్ అన్నారు. ‘ఇది చాలా దారుణం.. వీధి కుక్కలను ఉపాధ్యాయులు లెక్కిస్తే విద్యార్థులను ఎవరు చూసుకుంటారు? ఊపాధ్యాయుల గౌరవం, ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారు’ అని ఆయన మండిపడ్డారు.


జంతు సంరక్షణ, అటవీ లేదా ఇతర ప్రభుత్వ విభాగాలకు ఈ ప్రక్రియను ఎందుకు అప్పగించడం లేదని ప్రశ్నిస్తున్నారు. ‘ఉపాధ్యాయ వృత్తి ఎంతో గౌరవప్రదమైంది.. కానీ, ప్రభుత్వం మమ్మల్ని వీధి కుక్కుల లెక్కించే పనికి నియమించింది.. బోధనేతర పనులకు ఉపాధ్యాయులకు వినియోగిస్తే విద్యార్థుల చదువు, సమాజ భవిష్యత్తు ఏమవుతుంది’ అని ఫోగట్ నిలదీశారు.


అధికారులు మాత్రం సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఈ ప్రక్రియ జరుగుతోందని అంటున్నారు. వీధి కుక్కులను విద్యాసంస్థలు, ఆసుపత్రులు, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్ల నుంచి ఆశ్రయాలకు తరలించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు గత నెలలో సుప్రీంకోర్టు ఆదేశించింది. కుక్కలను తరలించే ముందు వాటికి స్టెరిలైజేషన్, టీకాలు వేసేలా చూడటానికి నోడల్ అధికారులను నియమించాలని కూడా కోర్టు ఆదేశించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa