అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఇజ్రాయెల్ ప్రభుత్వం అరుదైన గౌరవాన్ని ప్రకటించింది. ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన 'ఇజ్రాయెల్ ప్రైజ్ ఫర్ పీస్'ను ట్రంప్కు ప్రదానం చేయనున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వెల్లడించారు. సోమవారం ఫ్లోరిడాలోని మార్-ఎ-లాగోలో ఇరువురు నేతల మధ్య జరిగిన ద్వైపాక్షిక భేటీ అనంతరం ఈ ప్రకటన వెలువడిందని సీఎన్ఎన్ వార్తా సంస్థ పేర్కొంది.గత 80 ఏళ్ల చరిత్రలో ఈ పురస్కారాన్ని ఓ విదేశీయుడికి (నాన్-ఇజ్రాయెల్ సిటిజన్) ఇవ్వడం ఇదే తొలిసారి కాగా.. శాంతి విభాగంలో అవార్డును ప్రకటించడం కూడా ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ ఏడాది జులై లో ఇజ్రాయెల్ తమ నిబంధనలను సవరించి మరీ విదేశీయులకు ఈ అవార్డు ఇచ్చేలా మార్పులు చేసింది. ఇజ్రాయెల్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు హాజరై ట్రంప్ ఈ అవార్డును స్వీకరించే అవకాశం ఉంది."ట్రంప్ ఎన్నో సంప్రదాయాలను తిరగరాసి అందరినీ ఆశ్చర్యపరిచారు. అందుకే మేం కూడా సంప్రదాయాన్ని పక్కనపెట్టి తొలిసారి ఓ ఇజ్రాయేలేతరుడికి ఈ అవార్డును ఇస్తున్నాం. యూదు ప్రజలకు, ఇజ్రాయెల్ భద్రతకు ట్రంప్ చేసిన సేవలకు ఇది గుర్తింపు" అని నెతన్యాహు పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ట్రంప్.. ఈ గౌరవం తనను ఆశ్చర్యపరిచిందని, ఇజ్రాయెల్ గుర్తింపు పట్ల ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.భేటీలో భాగంగా గాజా శాంతి ఒప్పందం రెండో దశ, వెస్ట్ బ్యాంక్ అంశాలపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. వెస్ట్ బ్యాంక్ విషయంలో తమ మధ్య కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ.. ఇజ్రాయెల్ ఒప్పందానికి కట్టుబడి ఉందని, ఆ దేశం బలంగా ఉందని ట్రంప్ కితాబునిచ్చారు. చర్చలు ఫలప్రదంగా జరిగాయని నెతన్యాహు వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa