ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో రేషన్ కార్డు ఉన్నవారికి బంపర్ న్యూస్.. ఇప్పుడే తెలుసుకోండి!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 01, 2026, 08:54 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు శుభవార్త అందించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రయోగాత్మకంగా గోధుమ పిండి పంపిణీ కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభించింది. పట్టణ ప్రాంతాల్లోని రేషన్ కార్డుదారులకు కిలో గోధుమ పిండిని కేవలం రూ.20కే అందిస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ కార్పొరేషన్ ఎండీ ఢిల్లీరావు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కేటాయించిన సుమారు 1800 టన్నుల గోధుమలను సమర్థంగా వినియోగిస్తున్నామని తెలిపారు. ఈ గోధుమలను సాధారణ మిల్లుల్లో కాకుండా, సంప్రదాయ పద్ధతిలో తిరగలి ద్వారా పిండి పట్టించి ప్యాకెట్ల రూపంలో పంపిణీ చేస్తున్నట్లు వివరించారు.ఈ విధానంతో పిండిలోని పోషకాలు నశించకుండా ఉంటాయని, ప్రజలకు నాణ్యమైన ఆహారం అందుతుందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా జిల్లా కేంద్రాల్లో అమలు చేస్తున్నామని, ఇది విజయవంతమైతే త్వరలోనే రాష్ట్రంలోని అన్ని రేషన్ దుకాణాలకు విస్తరిస్తామని ఎండీ ఢిల్లీరావు స్పష్టం చేశారు. ఈ అవకాశాన్ని కార్డుదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.ఇదే సమయంలో పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించిన వివరాల ప్రకారం, 2026 జనవరి నుంచి రేషన్ షాపుల్లో కొత్త సరుకులు అందుబాటులోకి వచ్చాయి. గోధుమ పిండితో పాటు రాగులు, అట్టాను కూడా కార్డుదారులకు పంపిణీ చేస్తున్నారు. కిలో గోధుమ పిండిని రూ.18కు అందిస్తుండగా, రాగులను 3 కిలోల వరకు ఇస్తున్నారు. రైస్ కార్డు ఉన్నవారికి బియ్యం కోటాలో కొంత తగ్గించి, దానికి బదులుగా ఈ చిరుధాన్యాలను అందిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం గోధుమలు, మిల్లెట్లు కేటాయించడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పోషకాహార లోపాన్ని తగ్గించడమే ఈ మార్పుల ప్రధాన లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా లబ్ధిదారులకు పలు నిత్యావసర వస్తువులు అందుతున్నాయి. ప్రాధాన్య కుటుంబాలకు వ్యక్తికి 5 కిలోల బియ్యం లేదా గోధుమలు, అంత్యోదయ కార్డుదారులకు కుటుంబానికి 35 కిలోల బియ్యం సరఫరా చేస్తున్నారు. వీటితో పాటు కిలో పంచదార, కిలో కందిపప్పు, లీటర్ పామాయిల్ ఇస్తున్నారు. గ్యాస్ కనెక్షన్ లేని కుటుంబాలకు కిరోసిన్ కూడా అందిస్తున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో గోధుమ పిండి, రాగులు చేరడం పేదలకు మరింత మేలు చేస్తుందని భావిస్తున్నారు. ఈ కొత్త విధానం ద్వారా తక్కువ ధరకే బలవర్ధకమైన ఆహారం లభిస్తుందని అధికారులు చెబుతున్నారు.సంప్రదాయ మిల్లింగ్ విధానంలో పిండి తయారు చేయడం వల్ల గోధుమల్లోని ఫైబర్‌తో పాటు ఇతర పోషకాలు నిల్వ ఉంటాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా రిఫైన్డ్ పిండిలో ఈ పోషకాలు తగ్గే అవకాశముంటుందని వారు చెబుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ ప్రత్యేక చర్యలతో ప్రజలకు నాణ్యమైన పిండి అందుతుందని అధికారులు అంటున్నారు. అలాగే రాగుల పంపిణీ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఆరోగ్యంపై అవగాహన పెంచుతుందని ఆశిస్తున్నారు. గోధుమ పిండి, రాగుల వినియోగం పెరగడం వల్ల ప్రజల ఆహారపు అలవాట్లలో సానుకూల మార్పులు వస్తాయని వారు భావిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa