కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు కొలువైన తిరుమలలో మరో అపచారం చోటుచేసుకుంది. తిరుమలలోని పోలీసు అతిథి గృహం ముందు ఖాళీ మద్యం బాటిళ్లు కనిపించాయంటూ వీడియోలు వైరల్ అయ్యాయి. పవిత్ర తిరుమలలో మద్యం, మాంసాహారం నిషేధం. ఇలాంటివి కొండపైకి రాకుండా అలిపిరి వద్దే పటిష్టమైన తనిఖీలు చేపడుతూ ఉంటారు. అలాంటిది పోలీస్ అతిథి గృహం వద్ద పదుల సంఖ్యలో మద్యం బాటిళ్లు కనిపించాయనే వార్తలు కలకలం రేపాయి. దీనిపై భక్తులు మండిపడుతున్నారు. టీటీడీ నిఘా వ్యవస్థ ఏం చేస్తోందని ప్రశ్నిస్తున్నారు. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద తనిఖీలను దాటుకుని కొండపైకి మద్యం బాటిళ్లు ఎలా వచ్చాయని ప్రశ్నిస్తున్నారు.
మరోవైపు ఈ ఘటనపై తిరుమల తిరుపతి దేవస్థానం స్పందించింది. బాలాజీనగర్కు ఆనుకుని ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో చెట్ల మద్య కొన్ని ఖాళీ మద్యం బాటిళ్లను గుర్తించినట్లు టీటీడీ తెలిపింది. సీసీటీవీ ఫుటేజీ ద్వారా ఇందుకు కారణమైన వారిని గుర్తిస్తామని.. అలాగే విధులలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటామని టీటీడీ తెలిపింది.
సాధారణంగా అలిపిరి చెక్ పోస్టు వద్ద ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. నిషేధిత వస్తువులు ఏవైనా ఉంటే అక్కడే స్వాధీనం చేసుకుంటారు. అలాంటిది అలిపిరి చెక్ పోస్టును దాటుకుని మందుబాటిల్స్ కొండపైకి ఎలా చేరాయనేదీ ప్రాధ్యానం సంతరించుకుంది. అలిపిరిలోని టీటీడీ సిబ్బంది నిర్లక్ష్యంగా కారణంగానే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
మరోవైపు తిరుమలలోని ఓ అతిథి గృహంలో కోడిగుడ్లు బయటపడిన ఘటన ఇటీవలే చోటుచేసుకుంది. కౌస్తుభం వసతి గృహంలోని 538 నంబర్ గదిలో ఓ యాత్రికుడు కోడిగుడ్లు తీసుకువచ్చాడు. ఈ ఘటనపై టీటీడీ కూడా సీరియస్ అయ్యింది. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బంది మీద చర్యలకు ఆదేశించింది. కోడిగుడ్లను తెచ్చిన వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే కొంతమంది తిరుమలలో రాజకీయ పార్టీకి సంబంధించిన బ్యానర్ను ప్రదర్శించడం కూడా డిసెంబర్ నెలలో కలకలం రేపింది. దీనిపైనా టీటీడీ చర్యలకు ఆదేశించింది.
మరోవైపు మెట్ల మార్గంలో టీటీడీ సిబ్బంది మాంసాహరం తినడం కూడా ఇటీవల కలకలం రేపింది. టీటీడీ కాంట్రాక్ట్ సిబ్బంది మెట్లమార్గంలో కూర్చొని మాంసాహారం తింటూ ఉండటాన్ని కొంతమంది భక్తులు గుర్తించారు. ఈ విషయాన్ని వీడియో తీసి టీటీడీకి ఫిర్యాదు చేశారు. దీనిపైనా తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు తీసుకుంది. అయితే ఘటన జరిగిన తర్వాత కాకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని శ్రీవారి భక్తులు కోరుతున్నారు. తిరుమలలో మరిన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని.. నిఘా వ్యవస్థను పటిష్టపరచాలని కోరుతున్నారు. అలిపిరిలో తనిఖీ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని కోరుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa