తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. మార్చి నెలలో తిరుమల శ్రీవారి ఆలయం మూతపడనుంది. మార్చి 3వ తేదీన చంద్రగ్రహణం సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయ ద్వారాలను పది గంటల పాటు మూసివేయనున్నారు. ఈ విషయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఓ ప్రకటనలో వెల్లడించింది. మార్చి మూడో తేదీ సాయంత్రం 3 గంటల 20 నిమిషాలకు చంద్రగ్రహణం ప్రారంభం కానుంది. సాయంత్రం 6 గంటల 47 నిమిషాల వరకూ చంద్రగ్రహణం కొనసాగనుంది. ఈ చంద్రగ్రహణం మూడున్నర గంటల పాటు కొనసాగనుంది. ఈ నేపథ్యంలో గ్రహణం ప్రారంభానికి ఆరు గంటల ముందుగానే తిరుమల శ్రీవారి ఆలయ ద్వారాలను మూసివేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది.
మార్చి 3వ తేదీ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల 30 నిమిషాల వరకూ తిరుమల ఆలయం ద్వారాలు మూతపడనున్నాయి. గ్రహణ కాలం ముగిసిన తర్వాత ఆలయాన్ని శుద్ధి చేసిన అనంతరం భక్తులను తిరుమల శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నారు. ఈ నేపథ్యంలో రాత్రి ఎనిమిదిన్నర గంటల తర్వాత మాత్రమే భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. చంద్రగ్రహణం నేపథ్యంలో మార్చి మూడో తేదీన తిరుమల శ్రీవారి ఆలయంలో అష్టాదళ పాదపద్మారాధన సేవ, ఊంజల్ సేవ, కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహశ్ర దీపాలంకర సేవలను రద్దు చేసినట్లు టీటీడీ వెల్లడించింది. భక్తులు ఈ విషయాన్ని గమనించుకోవాలని సూచించింది.
దేవుని గడపలో బ్రహ్మోత్సవాలు
మరోవైపు కడప జిల్లా దేవుని కడపలో ఉన్న లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. జనవరి 19 నుంచి 27వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో జనవరి 18వ తేదీ సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల సమయంలో అంకురార్పణ చేయనున్నారు.
జనవరి 24న ఉదయం 10.30 గంటలకు కల్యాణోత్సవం జరుగనుంది. రూ.300/- చెల్లించి కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. జనవరి 28వ తేదీ సాయంత్రం 6 గంటలకు పుష్పయాగం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఉదయం, సాయంత్రం వాహనసేవలు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగాప్రతిరోజు హరికథలు,ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa