సంక్రాంతి పండుగకు సమయం దగ్గరపడుతోంది. సిటీ నుంచి జనం పల్లెబాట పట్టేందుకు రెడీ అవుతున్నారు. వారం రోజుల పాటు పల్లెల్లో సంక్రాంతి సంబరాలు జరుపుకునందుకు సిద్ధమవుతున్నారు. విద్యార్థులకు స్కూళ్లకు కూడా సెలవులు ప్రకటించటంతో.. ప్రయాణాలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇక సంక్రాంతి వచ్చిందంటే హైదరాబాద్ నగరం సగం ఖాళీ అవుతుందని అనుకోవచ్చు. ఉపాధి కోసం ఊర్ల నుంచి వచ్చిన జనం.. సంక్రాంతి పండుగకు తిరిగి సొంతూరు బాటపడుతుంటారు. దీంతో రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు కిక్కిరిసిపోతుంటాయి. అలాగే బస్సులు, రైళ్లల్లో సీట్ల కోసం పడే పాట్లు ఎన్నో. దొరికిందే సందని ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ వ్యవహారం కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో సంక్రాంతి పండుగకు ఊరెళ్లేవారికి ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త వినిపించింది.
సంక్రాంతి పండుగకు నగరాల నుంచి ఊర్లకు వెళ్లటంతో పాటుగా తిరిగి హైదరాబాద్ వంటి నగరాలకు రావటం కోసం కూడా ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తోంది. సంక్రాంతి పండుగ రద్దీ నేపథ్యంలో ఈసారి 8 వేలకు పైగా ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ ప్రకటించింది. రద్దీని దృష్టిలో పెట్టుకుని రోజూ రాకపోకలు సాగించే సాధారణ సర్వీసులకు అదనంగా 8,432 ప్రత్యేక బస్సులను ఏపీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేసింది. స్త్రీశక్తి పథకం నేపథ్యంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల మధ్య ప్రత్యేక బస్సులకు అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిపింది.
ఇందులో భాగంగా 71 శాతం బస్సులను రాష్ట్రంలోనే ప్రత్యేక సర్వీసులుగా నడపనున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ వెల్లడించింది.ఈ నేపథ్యంలో అదనంగా ఏర్పాటు చేస్తున్న 8432 ప్రత్యేక బస్సు సర్వీసులలో.. 6 వేల బస్సు సర్వీసులను రాష్ట్రంలోని పట్టణాలు, మండలాలు, గ్రామాల మధ్య నడుపుతామని ఏపీఎస్ఆర్టీసీ ప్రకటించింది. చెన్నై, హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రాంతాలకు 2,432 ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేసింది.
పండగకు ముందు 3857 ప్రత్యేక బస్సులు
ఇక సంక్రాంతి పండుగకు ముందు 3,857 ప్రత్యేక బస్సులు నడపనున్న ఏపీఎస్ఆర్టీసీ.. హైదరాబాద్కు 240, బెంగళూరుకు 102 బస్సు సర్వీసులు, చెన్నైకు 15 బస్సు సర్వీసులు ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల మధ్య 3500 ప్రత్యేక బస్సు సర్వీసులు నడపనుంది.
తిరుగు ప్రయాణానికి 4575 ప్రత్యేక బస్సులు
మరోవైపు పండుగకు ముందు రోజులతో పోలిస్తే తిరుగు ప్రయాణానికి ఏపీఎస్ఆర్టీసీ ఎక్కువ బస్సులు కేటాయించింది. సొంతూర్ల నుంచి తిరుగు ప్రయాణానికి 4,575 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయగా.. ఇందులో హైదరాబాద్కు మాత్రమే 1800 ప్రత్యేక బస్సులు ఉన్నాయి. బెంగళూరుకు 200, చెన్నైకు 75 ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంచింది. అలాగే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించేందుకు 2500 బస్సులు ఏర్పాటు చేశారు. మరోవైపు ప్రత్యేక బస్సులలో కూడా సాధారణ ఛార్జీలే ఉంటాయని ఏపీఎస్ఆర్టీసీ ప్రకటించింది. అలాగే దూర ప్రాంతాల బస్సు సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సదుపాయం కల్పించినట్లు వెల్లడించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa