ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆపరేషన్ సిందూర్‌ను ఆపడానికి అమెరికాలో పాక్‌ లాబీయింగ్

national |  Suryaa Desk  | Published : Tue, Jan 06, 2026, 10:15 PM

గతేడాది మే నెలలో ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ సైనిక చర్యను అడ్డుకోడానికి.. వాషింగ్టన్‌లో లాబీయింగ్‌లు ద్వారా పాకిస్థాన్ తీవ్రంగా ప్రయత్నించిన విషయాన్ని తాజాగా విడుదలైన అమెరికా ప్రభుత్వ పత్రాలు బయటపెట్టాయి. ఈ సమయంలో పాకిస్థాన్ దౌత్యవేత్తలు, రక్షణ శాఖ అధికారులు అమెరికా ఉన్నతాధికారులు, చట్టసభ సభ్యులు, మీడియా ప్రతినిధులతో 50కి పైగా సమావేశాలు జరిపి, భారత్‌ను నియంత్రించాలని కోరినట్టు ఆ పత్రాలు వెల్లడించాయి. ఏప్రిల్ 22, 2025లో జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా పహల్గామ్‌లో ఉగ్రదాడి తర్వాత భారత్ ఆపరేషన్ సిందూర్ , భారత్, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో వచ్చే వరకు ఈ ప్రయత్నాలు కొనసాగాయి.


60కిపైగా సమావేశాలు


అమెరికా విదేశీ ఏజెంట్ల నమోదు చట్టం కింద విడుదలై పత్రాల ప్రకారం.. పాకిస్థాన్ రాయబారి, రక్షణ శాఖ ముఖ్య అధికారి ఈ-మెయిళ్లు, ఫోన్ కాల్స్, ప్రత్యక్ష సమావేశాల ద్వారా 60 మందికిపైగా అధికారులను, మధ్యవర్తులను సంప్రదించారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన సైనిక చర్యను ఆపాలని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని అమెరికాను వారు కోరారు. ఈ చర్చలు కాంగ్రెస్, పెంటగాన్, స్టేట్ డిపార్ట్‌మెంట్, ప్రముఖ అమెరికా జర్నలిస్టుల వరకు విస్తరించాయి. పాకిస్థాన్ ప్రతినిధులు కశ్మీర్ వివాదం, ప్రాంతీయ భద్రత, అరుదైన ఖనిజాలు, ద్వైపాక్షిక సంబంధాల గురించి చర్చించారు.


లాబీయింగ్ సంస్థలతో ఒప్పందాలు


ప్రముఖ అమెరికా మీడియా సంస్థలతో ఇంటర్వ్యూలు, సమావేశాలు కూడా కోరారు. ఈ ప్రయత్నాలను ‘పాకిస్థాన్ నిరంతర ప్రాతినిధ్యం’గా కొన్ని రికార్డులు పేర్కొన్నాయి. ఇది వారి ప్రచార తీవ్రతను తెలియజేస్తోంది. అయితే, ఈ లాబీయింగ్ ప్రయత్నాలు అకస్మాత్తుగా జరగలేదు. గతేడాది నవంబరులో ‘ది న్యూయార్క్ టైమ్స్'’ పత్రిక నివేదిక ప్రకారం.. అమెరికాలోని ఆరు లాబీయింగ్ సంస్థలతో సుమారు 5 మిలియన్ డాలర్ల మేర వార్షిక ఒప్పందాలను పాకిస్థాన్ కుదుర్చుకుంది. దీని ద్వారా ట్రంప్ యంత్రాంగంతో త్వరగా సంబంధాలు ఏర్పరచుకుని, అనుకూల వాణిజ్య, దౌత్య ఫలితాలను సాధించాలని భావించింది.


ట్రంప్ మునీర్ భేటీ


సీడెన్ లా LLPతో ఒప్పందం కుదుర్చుకున్న కొద్ది వారాలకే.. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్‌ వైట్ హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కలిశారు. ఇది పాకిస్థాన్‌కు అమెరికా అగ్రనాయకత్వ స్థాయిల్లో తిరిగి ప్రాధాన్యత లభించిందని సూచించింది. అంతేకాదు.. పాకిస్థాన్ ఏప్రిల్, మే నెలల్లో లాబీయింగ్ కోసం తన ఖర్చును గణనీయంగా పెంచింది. అదే సమయంలో భారత్ కంటే మూడు రెట్లు ఎక్కువ ఖర్చు చేసింది.


ఈ పరిణామాల వల్ల అమెరికా-పాకిస్థాన్ సంబంధాల్లో మార్పు వచ్చిందని, ట్రంప్ ప్రశంసలు, నోబెల్ శాంతి బహుమతికి ఆయన పేరు ప్రతిపాదన, లాభదాయక వ్యాపార, వాణిజ్య రాయితీలు పొందడం వంటివి జరిగాయని ది న్యూయార్క్ టైమ్స్ పత్రిక పేర్కొంది. పలు దౌత్య వర్గాల ప్రకారం.. 2025 FARA నమోదు ఒక విస్తృత నమూనాను ధ్రువీకరిస్తున్నాయి. క్యాపిటల్ హిల్, అమెరికా మీడియా రంగంలో తన లాబీయింగ్ ప్రభావాన్ని పాకిస్థాన్ పెంచుకుంది. కొన్ని వ్యక్తిగత ఒప్పందాలు, సంప్రదింపుల కోసం లక్షల డాలర్లు ఖర్చు చేసింది. గతేడాది చివరిలో ఖర్చు తగ్గినప్పటికీ, ఈ పత్రాలు సైనిక, దౌత్యపరమైన ఒత్తిడిలో ఉన్న ఒక దేశం.. భారత్ సైనిక దూకుడును అడ్డుకోవడానికి అత్యవసరంగా వాషింగ్టన్‌ను ఆశ్రయించినట్లు స్పష్టంగా తెలియజేస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa