ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉమర్, ఇమామ్‌లకు బెయిల్ రాకపోవడంతో నిరసనలు

national |  Suryaa Desk  | Published : Tue, Jan 06, 2026, 10:12 PM

ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) మరోసారి వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. 2020 ఢిల్లీ అల్లర్ల కేసులో నిందితులుగా ఉన్న ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమామ్‌లు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించడంతో జేఎన్‌యూ క్యాంపస్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాలకు వ్యతిరేకంగా విద్యార్థులు వివాదాస్పద నినాదాలు చేయడం రాజకీయంగా పెను దుమారం రేపుతోంది.


ఈనెల 5వ తేదీ జేఎన్‌యూ క్యాంపస్‌లో విద్యార్థుల బృందం నిరసన ప్రదర్శన చేపట్టింది. సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ ప్రధాని మోదీ, అమిత్ షాలను ఉద్దేశించి అనుచిత నినాదాలు చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ఘటనపై రాజకీయ వర్గాలు భిన్నంగా స్పందిస్తున్నాయి.


ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ నేత ఉదిత్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమామ్ ముస్లింలు కాబట్టే వారి పట్ల ఇలా వ్యవహరిస్తున్నారని ఆయన తీవ్ర ఆరోపణలు గుప్పించారు. వారి పట్ల అన్యాయం జరిగిందని.. సుప్రీంకోర్టు తీర్పు దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. జేఎన్‌యూ విద్యార్థులు చేస్తున్న నినాదాలు వారి ఆగ్రహాన్ని తెలియజేస్తున్నాయని సమర్థించారు.


పాముల పడగలు అణచివేస్తున్నాం: కపిల్ మిశ్రా


మరోవైపు.. ఈ నిరసనలను బీజేపీ నేత కపిల్ మిశ్రా తీవ్రంగా ఖండించారు. పాముల పడగలు అణచివేస్తుంటే.. పిల్ల పాములు విలవిలలాడుతున్నాయంటూ ఘాటుగా స్పందించారు. దేశంలో నక్సలైట్లు, ఉగ్రవాదులు, అల్లరి మూకల పతనం మొదలైందని.. ఆ కోపంలోనే ఇలాంటి నినాదాలు చేస్తున్నారని మండిపడ్డారు.


అరాచకాన్ని సహించం: జేడీయూ, సిర్సా


దేశంలో ఎలాంటి అరాచకాన్ని సహించేది లేదని.. జేడీయూ అధికార ప్రతినిధి రాజీవ్ రంజన్ తేల్చి చెప్పారు. కోర్టు ఇచ్చిన తీర్పులను అందరూ గౌరవించాల్సిందేనని స్పష్టం చేశారు. అదే సమయంలో ఢిల్లీ మంత్రి మంజీందర్ సింగ్ సిర్సా స్పందిస్తూ.. దేశ ప్రధాని, హోం మంత్రులపై తప్పుడు భాష వాడటం సిగ్గుచేటు అని.. దీని వెనుక ఆప్, కాంగ్రెస్ హస్తం ఉందని ఆరోపించారు.


ఢిల్లీ అల్లర్ల కేసులో గత 5 ఏళ్లుగా జైలులో ఉన్న స్టూడెంట్ నేతలు ఉమర్ ఖలీద్‌, షర్జీల్ ఇమామ్‌లు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌లను సోమవారం రోజున సుప్రీంకోర్టు కొట్టివేసింది. వీరిద్దరు కాకుండా ఈ కేసులో నిందితులుగా ఉన్న మిగిలిన ఐదుగురికి మాత్రం బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ మంజూరు విషయంలో నిందితులు అందరినీ ఒకే రకంగా చూడలేమని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు పేర్కొంది. దీంతో గుల్ఫీషా ఫాతిమా, షైఫా ఉర్ రెహ్మాన్, మీరన్ హైదర్, షాదాబ్ అహ్మద్‌, మహ్మద్ సలీమ్ ఖాన్‌లకు కండిషన్ బెయిల్ ఇచ్చింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa