ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'హిజాబ్ ధరించిన మహిళ ప్రధాని అవుతుంది': అసదుద్దీన్ ఒవైసీ

national |  Suryaa Desk  | Published : Sat, Jan 10, 2026, 09:35 PM

మహారాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన హిజాబ్ ప్రధాని వ్యాఖ్యలు అధికార బీజేపీ, ఎంఐఎం మధ్య మాటల యుద్ధానికి దారితీశాయి. భారత రాజ్యాంగం ప్రకారం ఎవరైనా అత్యున్నత పదవులను అధిష్టించవచ్చని ఒవైసీ అనగా.. అటువంటి కలలు కనేవారు పాకిస్థాన్‌కు వెళ్లాలని బీజేపీ ఘాటుగా బదులిచ్చింది.


సోలాపూర్‌లో జరిగిన బహిరంగ సభలో ఒవైసీ ప్రసంగిస్తూ భారత్, పాక్ రాజ్యాంగాల మధ్య వ్యత్యాసాన్ని వివరించారు. "పాకిస్థాన్ రాజ్యాంగం ప్రకారం ఒక నిర్దిష్ట మతానికి చెందిన వారే ప్రధాని కావాలి. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన మన రాజ్యాంగం మాత్రం ఏ భారత పౌరుడైనా ప్రధాని, ముఖ్యమంత్రి లేదా మేయర్ కావచ్చని చెబుతోంది. ఈ దేశానికి హిజాబ్ ధరించిన కూతురు ప్రధాన మంత్రి అయ్యే రోజు వస్తుందనేది నా కల" అని ఆయన పేర్కొన్నారు.


ఒవైసీ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే నితీష్ రాణే తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇది హిందూ రాష్ట్రమని.. ఇక్కడ 90 శాతం జనాభా హిందువులేనని ఆయన గుర్తు చేశారు. "ముంబయిలో బుర్కా లేదా హిజాబ్ ధరించిన మహిళ మేయర్ కానీ, ప్రధాని కానీ కాలేరు. అటువంటి కోరికలు ఉన్నవారు ఇస్లామాబాద్‌కో లేదా కరాచీకో వెళ్లిపోవాలి. ఇక్కడ అలాంటి వారికి చోటు లేదు. బీఎంసీ (ముంబై కార్పొరేషన్) పై కేవలం హిందూ-మరాఠీ జెండానే ఎగురుతుంది" అని రాణే స్పష్టం చేశారు.ఇదీ చూడండి: మీ అమ్మను, తాతను చంపింది కూడా ఉగ్రవాదులే.. అది గుర్తుంచుకో..: అసదుద్దీన్ ఒవైసీ


బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ఒవైసీకి ఒక సవాలు విసిరారు. "ప్రధాని కావడానికి రాజ్యాంగంలో అడ్డంకులు లేవన్నది నిజమే. కానీ ముందు ఓట్లు సాధించాలి. హిజాబ్ ధరించిన మహిళ ప్రధాని కావాలని కలలు కనే ఒవైసీ.. ముందుగా తన పార్టీ అధ్యక్ష పదవిలో ఒక ముస్లిం మహిళను లేదా పస్మాండా ముస్లింను ఎందుకు కూర్చోబెట్టరు?" అని ప్రశ్నించారు. సెక్యులరిజం పాఠాలు ఆపి, సొంత పార్టీలో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని హితవు పలికారు.


కేంద్ర మాజీ మంత్రి గిరిరాజ్ సింగ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ చేసిన పొరపాట్ల వల్ల గతంలో జరిగినవి ఇప్పుడు మళ్లీ జరగనివ్వబోమని హెచ్చరించారు. "ఒవైసీ మనసులో గజ్వా-యే-హింద్ ఆలోచనలు ఉంటే అవి పగటి కలలే అని చెప్పారు. ఈ దేశంలో రెండో పాకిస్థాన్ ఏర్పడటానికి వీళ్లేదు. ఇక్కడ కేవలం రాజ్యాంగం, చట్టం మాత్రమే చెల్లుతాయి" అని తేల్చి చెప్పారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa