ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వడోదరాలో కివీస్ క్లాస్ షో.. మిచెల్ మ్యాజికల్ ఇన్నింగ్స్! భారత్‌కు భారీ టార్గెట్

sports |  Suryaa Desk  | Published : Sun, Jan 11, 2026, 08:53 PM

వడోదరా వేదికగా జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో న్యూజిలాండ్ భారీ స్కోర్ చేసింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్, కివీస్‌ను భారీ స్కోర్ చేయడంలో కట్టడి చేయలేకపోయింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు పరుగులు రాబట్టారు న్యూజిలాండ్ బ్యాటర్లు. ఓపెనర్లు డెవాన్ కాన్వే, నికోలస్ అద్భుత ఆరంభం ఇవ్వడం.. మిడిలార్డర్‌లో మిచెల్ రాణించడంతో న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది.


వరుస టాస్‌లు ఓడిపోతూ వస్తున్న శుభమన్ గిల్ కివీస్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్నాడు. టీమిండియా పేసర్లు మొహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ తొలి వికెట్‌ను తీయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. భారత బౌలర్లు ఎంత ప్రయత్నించినా మొదటి వికెట్ పడటానికి 22వ ఓవర్ వరకూ ఎదురుచూడాల్సి వచ్చింది.


హర్షిత్ రాణా అద్భుత బౌలింగ్‌తో సెటిల్ ఓపెనర్లు హెన్రీ నికోలస్, డెవాన్ కాన్వేను వెంటవెంటనే అవుట్ చేయడంతో భారత్‌కు బ్రేక్ త్రూ దక్కింది. నికోలస్ 69 బంతుల్లో 62 పరుగులు చేయగా, కాన్వే 67 బంతుల్లో 56 పరుగులు చేసి అవుటయ్యాడు. ఈ ఇద్దరూ అవుటైన తర్వాత వరుస వికెట్లు పడుతూ వస్తున్నా డారెల్ మిచెల్ మాత్రం నిలకడగా ఆడుతూ వస్తూ స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లాడు.


30 ఓవర్లు దాటిన తర్వాత కుల్దీప్ యాదవ్‌తో పాటు సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ వెంటవెంటనే కివీస్ బ్యాటర్లను పెవిలియన్‌కు పంపారు. విల్ యంగ్ 12, గ్లెన్ ఫిలిప్స్ 12, మిచెల్ హే 18, మైకేల్ బ్రాస్‌వెల్ 16 పరుగులు చేసి అవుటయ్యారు. మిచెల్ - బ్రాస్‌వెల్ మంచి భాగస్వామ్యం నెలకొల్పుతున్న సమయంలో అనవసరంగా రెండో పరుగుకు ప్రయత్నించడంతో కెప్టెన్ బ్రాస్‌వెల్ రనౌట్ అయ్యాడు.


నాలుగో వికెట్‌గా 28వ ఓవర్‌లో క్రీజులోకి వచ్చిన డారెల్ మిచె‌ల్ 48వ ఓవర్ వరకూ క్రీజులోనే కొనసాగాడు. భారత్ పేస్ బౌలింగ్‌ని టార్గెట్ చేసిన మిచెల్ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదాడు. 71 బంతులు ఆడిన మిచెల్ 5 ఫోర్లు, మూడు సిక్సర్లతో 84 పరుగులు చేసి అవుటయ్యాడు. ప్రసిద్ధ్ కృష్ణ ఓవర్‌లో వరుసగా 4, 6, 4 బాదిన తర్వాత ఎల్‌బీడబ్ల్యూగా పెవిలియన్ బాట పట్టాడు. డెబ్యూ ఆటగాడు క్రిస్టియన్ క్లార్క్ 17 బంతుల్లో 24 పరుగులు చేయడంతో న్యూజిలాండ్ 300 పరుగుల మార్క్‌ను టచ్ చేసింది. దాంతో భారత్ విజయానికి 301 పరుగులు కావాల్సి వచ్చింది.


భారత బౌలర్లలో మొహమ్మద్ సిరాజ్ రెండు వికెట్లు తీసుకోగా.. యువ బౌలర్లు ప్రసిద్ధ్ కృష్ణ హర్షిత్ రాణాకి కూడా రెండు వికెట్లు దక్కాయి. కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. వాషింగ్టన్ సుందర్ ఐదు ఓవర్లు బౌలింగ్ చేసి 27 పరుగులు ఇవ్వగా, రవీంద్ర జడేజా 9 ఓవర్లలో 56 పరుగులు ఇచ్చాడు. మొత్తం 8 వికెట్లు పడగా ఒకటి రనౌట్ కాగా, ఆరు వికెట్లు పేసర్లకు దక్కాయి. ముగ్గురు స్పిన్నర్లు బౌలింగ్ చేసినప్పటికీ ఒక్క వికెట్టే దక్కడం విశేషం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa