ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వృద్ధ దంపతుల డిజిటల్ అరెస్ట్.. రూ.15 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు

Crime |  Suryaa Desk  | Published : Sun, Jan 11, 2026, 09:01 PM

డిజిటల్ అరెస్ట్‌లో చిక్కుకున్న ఇద్దరు వృద్ధ ఎన్ఆర్ఐ డాక్టర్ దంపతులు.. భారీగా నష్టపోయారు. వారు జీవితాంతం సంపాదించుకున్న ఆస్తులు మొత్తం కొన్ని రోజుల్లోనే కరిగిపోయాయి. సైబర్ నేరగాళ్ల వలలో చిక్కిన ఆ జంట.. తమ వద్ద ఉన్నదంతా సమర్పించుకున్నారు. కోట్ల రూపాయల సొమ్ము పోతున్నా.. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఆ వృద్ధులు మిగిలిపోయారు. సైబర్ కేటుగాళ్లు అంతా ఊడ్చుకున్న తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ఈ ఘటన బయటికి వచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఈ భారీ సైబర్ మోసం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏకంగా 17 రోజుల పాటు స్కామర్ల నిఘాలో ఉన్న ఆ వృద్ధ దంపతులు తమ జీవితకాల సంపాదన రూ. 14.85 కోట్లను పోగొట్టుకున్నారు.


దాదాపు 48 ఏళ్ల పాటు అమెరికాలో ఉన్న డాక్టర్ ఓం తనేజా, డాక్టర్ ఇందిరా తనేజా దంపతులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు ఈ స్కామ్ చేశారు. వీరు ఐక్యరాజ్యసమితిలో పనిచేసి రిటైర్ అయ్యారు. డిసెంబర్ 24వ తేదీన మనీలాండరింగ్, జాతీయ భద్రతా ఉల్లంఘనలకు పాల్పడ్డారంటూ చట్టపరమైన సంస్థల అధికారులమని చెప్పుకుంటూ సైబర్ నేరగాళ్లు ఆ వృద్ధ దంపతులకు ఫోన్ చేశారు. తమ వద్ద అరెస్ట్ వారెంట్లు ఉన్నాయని వారిని బెదిరించారు. డిసెంబర్ 24వ తేదీ నుంచి జనవరి 10వ తేదీ వరకు నిరంతరం వారికి వీడియో కాల్స్ చేసి అనుక్షణం నిఘా పెట్టారు. వారు బయటికి వెళ్లినా సరే.. వేరే వారికి ఫోన్ చేసినా వెంటనే వీడియో కాల్ చేసి బెదిరింపులకు గురి చేసేవారు.


 తీవ్ర భయాందోళనకు గురైన 77 ఏళ్ల డాక్టర్ ఇందిరా తనేజా.. సుమారు 8 వేర్వేరు బ్యాంక్ అకౌంట్లకు మొత్తం రూ. 14.85 కోట్లను ట్రాన్స్‌ఫర్ చేశారు. బ్యాంకులో ఎవరైనా అడిగితే ఏం చెప్పాలో కూడా వారికి సైబర్ నేరగాళ్లే శిక్షణ ఇవ్వడం గమనార్హం. జనవరి 10వ తేదీన ఆ సైబర్ స్కామర్లు మరో డ్రామా ఆడారు. ఆ వృద్ధ దంపతులు పంపించిన డబ్బును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) రీఫండ్ చేస్తుందని.. దాని కోసం స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలని చెప్పారు.


డాక్టర్ ఇందిరా తనేజా వీడియో కాల్‌లో ఉండగానే పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. స్కామర్లు ఫోన్‌లోనే అక్కడి పోలీసులతో కూడా దురుసుగా మాట్లాడారు. పోలీసులు ఆమెతో మాట్లాడి.. అదంతా సైబర్ మోసమని చెప్పడంతో ఆమె షాక్‌కు గురయ్యారు. తమ జీవితకాలపు పొదుపు మొత్తం మాయమైందని తెలిసి ఆ వృద్ధ దంపతులు తీవ్ర మనోవేదనకు లోనయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. కేసు తీవ్రత దృష్ట్యా దీన్ని స్పెషల్ సెల్ సైబర్ విభాగానికి బదిలీ చేశారు. నేరగాళ్లను పట్టుకునేందుకు అన్ని టెక్నికల్ ఆధారాలను విశ్లేషిస్తున్నారు.


డిజిటల్ అరెస్ట్ నుంచి ఎలా తప్పించుకోవాలి?


ఇలాంటి మోసాల బారిన పడకుండా ఉండాలంటే చాలా జాగ్రత్తలు పాటించాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ అధికారిక సంస్థలైన సీబీఐ, ఈడీ, పోలీస్, టెలికాం శాఖ అధికారులు ఎప్పుడూ వీడియో కాల్స్ ద్వారా ఎవరినీ అరెస్ట్ చేయరని తెలిపారు. అంతేకాకుండా అరెస్ట్ వారెంట్ ఉందని భయపెట్టి డబ్బులు అడుగుతున్నారంటే అది కచ్చితంగా మోసమే అని గుర్తించాలని పేర్కొంటున్నారు. ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు భయపడకుండా వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేయాలని సూచిస్తున్నారు. లేదా www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలని చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa